BREAKING : రైతులకు మద్దతుగా ఎన్డీయే నుంచి తప్పుకున్న ఆర్ఎల్పీ...
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షం రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ షాకిచ్చింది. ఎన్డీయే కూటమిని వీడుతున్నట్లు ఆ పార్టీ అధినేత హనుమాన్ బెనివాల్ ప్రకటించారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఈ నిర్ణయానికి తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాళీదళ్ ఎన్డీయే నుంచి తప్పుకోగా తాజాగా ఆర్ఎల్పీ కూడా అదే బాటలో నడవడం గమనార్హం.
రైతు వ్యతిరేక విధానాలను అనుసరించే ఎవరితోనైనా తాము కలిసి నడవమని హనుమాన్ బెనివాల్ స్పష్టం చేశారు. ఎన్డీయే నుంచి ఆర్ఎల్పీ నిష్క్రమణపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకపోతే ఎన్డీయే నుంచి తప్పుకుంటామని కొద్దిరోజుల క్రితమే ఆయన ఎన్డీయేని హెచ్చరించారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశారు. తక్షణం ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు.
హనుమాన్ బెనివాల్ రాజస్తాన్లోని నాగౌర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు రైతు నాయకుడిగా గుర్తింపు ఉంది. గతంలో బీజేపీలో పనిచేసిన ఆయన సొంత పార్టీ నేతలపైనే అవినీతి ఆరోపణలు చేసి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత సొంత పార్టీ ఏర్పాటు చేశారు.
గతంలో రాజస్తాన్లోని నాగౌర్,బర్మర్,బికనీర్,సికార్,జైపూర్ ప్రాంతాల్లో హనుమాన్ భారీ ఎత్తున రైతు నిరసనలు చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు నెలరోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో హనుమాన్ బెరివాల్ కూడా వారికి మద్దతుగా కదిలారు. ఎన్డీయే నుంచి ఆర్ఎల్పీ నిష్క్రమణపై బీజేపీ ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.
మరోవైపు పంజాబ్ బీజేపీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ హరీందర్ సింగ్ ఖల్సా పార్టీకి రాజీనామా చేశారు. రైతుల డిమాండుకు మద్దతుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ రైతులు నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తుండటంతో రాష్ట్ర బీజేపీ నేతలపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఖల్సా బీజేపీకి రాజీనామా చేశారు.