ఏపీ-తెలంగాణ మధ్య మరో వివాదం-ఉమ్మడి ప్రాజెక్టుల్లో చేపల వేట-మత్సకారుల ఫిర్యాదులతో
ఏపీ-తెలంగాణ మధ్య నీటి ప్రాజెక్టుల్లో తలెత్తిన వివాదాలు ఎప్పుడు పరిష్కారం అవుతాయో తెలియక ఇరు రాష్ట్రాలు తలపట్టుకుంటుంటే ఇప్పుడు తాజాగా మరో వివాదం చోటు చేసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల కేంద్రంగానే ఈ వివాదం కూడా చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఇప్పుడు ఏపీ పేరెత్తితేనే తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. తమ జలాల్లో ఏపీ పెత్తనం లేకుండా చూసేందుకు వీలుగా ఆదేశాలు కూడా ఇస్తోంది. దీంతో ఈ వివాదం మరో రచ్చకు దారి తీసేలా కనిపిస్తోంది.
Recommended Video
ఏపీ-తెలంగాణ వివాదాలు
ఏపీ-తెలంగాణ మధ్య 2014లోనే విభజన పూర్తయినా ఇప్పటికీ వివాదాలు మాత్రం సమసిపోలేదు. విభజన సరిగా పూర్తి కాకపోవడం, కేంద్రం జోక్యం చేసుకుంటున్నా ఇరు రాష్ట్రాలు సహకరించకపోవడంతో ఈ వివాదాలకు అంతు లేకుండా పోతోంది. దీంతో తిరిగి ఆయా రాష్ట్రాలు కేంద్రాన్నే ఆశ్రయించాల్సిన పరిస్దితులు నెలకొంటున్నాయి.
తాజాగా చోటు చేసుకున్న జల వివాదాలతో కేంద్రాన్ని ఆశ్రయించిన ఇరు రాష్ట్రాలూ నష్టపోయిన పరిస్ధితులు కళ్లముందే కదలాడుతున్నాయి. అంతలోపే తాజాగా మరో వివాదం చోటు చేసుకుంది. ఇందులో తెలంగాణ సర్కార్ దూకుడు ఏపీకి ఇబ్బందికరంగా మారుతోంది.
ఉమ్మడి ప్రాజెక్టుల్లో వివాదాలు
ఏపీ-తెలంగాణ మధ్య ఉమ్మడి ప్రాజెక్టులుగా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టుల్లో తమ హక్కుల్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న ఇరు రాష్ట్రాలు రోజుకో కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఇరుకునపడిన తెలంగాణ.. ఈ వివాదాన్ని పెద్దది చేయడంతో ఏపీ కూడా సీరియస్ గా స్పందించింది.
దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల్లో తగినంత నీరు లేకపోయినా జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి సవాల్ విసిరింది. దీనికి కౌంటర్ గా ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. చివరికి ఆాయా ప్రాజెక్టులపై పెత్తనాన్ని కృష్ణారివర్ బోర్డుకు అప్పగిస్తూ కేంద్రం గెజిట్ నోటీఫికేషన్ ఇచ్చేసింది. దీంతో ఇరు రాష్ట్రాలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రాజెక్టుల్లో మరో వివాదం
ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వాటాలపై ఇప్పటికే వివాదాలు కొ నసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం వివాదాస్పదమవుతూనే ఉంది. ఈ వివాదాలు పరిష్కారం కాకముందే తాజాగా మరో వివాదం మొదలైంది. ఈ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిలో చేపల వేటపై ఈ కొత్త వివాదం తలెత్తింది.
ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టుల్లోని నీటిలో ఇరు రాష్ట్రాల మత్సకారులు చేపల వేట కొనసాగించేవారు. కానీ ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో మత్సకారుల మధ్య కూడా ప్రాంతీయ భేదాలు తలెత్తాయి. దీంతో చేపల వేటపై అభ్యంతరాలు మొదలయ్యాయి. తమ అధికారులకు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంలో ఈ వ్యవహారం నానాటికీ ముదురుతోంది.
చేపల వేట కోసం మత్సకారుల పోటీ
ఏపీ-తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో ఇప్పటివరకూ ఇరు రాష్ట్రాల మత్సకారులు తమ పర భేదాలు లేకుండా చేపల వేట కొనసాగించేవారు. కానీ తాజాగా తలెత్తిన జల వివాదాల ప్రభావం వీరిపైనా పడింది. దీంతో ఇప్పుడు తమ జలాల్లోకి వచ్చి ఏపీ మత్సకారులు చేపల వేట చేయడాన్ని వారు అడ్డుకుంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తమ భూభూగంలోని 5800 మత్సకారులకు ఈ ప్రాజెక్టుల్లో చేపల వేటకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు వీరు ఏపీ మత్సకారులతో పాటు వేట కొనసాగించడం వల్ల తమకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఏపీ మత్సకారులపై తెలంగాణ మత్సశాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో స్పందించిన అధికారులు ఏపీ మత్సకారుల్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు.
ఏపీ మత్సకారులపై నిషేధం
తెలంగాణ మత్సకారులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన అధికారులు.. ఏపీకి చెందిన మత్సకారులు ఉమ్మడి ప్రాజెక్టుల్లోని తమ జలాల్లో చేపల వేట చేపట్టకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఏపీకి చెందిన మత్సకారుల్ని ఈ ప్రాజెక్టుల్లో ఉన్న తమ వైపు నీటిలోకి రాకుండా ఆంక్షలు విధిస్తున్నట్లు సమాచారం.
దీంతో ఈ వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య మరో వివాదానికి కారణమవుతోంది. అసలే ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటిపై వివాదాలు నెలకొన్న వేళ.. ఈ తాజా వ్యవహారంతో తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఏర్పడినట్లు అర్ధమవుతోంది. తెలంగాణ అధికారుల నిర్ణయంపై ఏపీ మత్సకారులు తమ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు.
అసలు సమస్య అక్కడే
ఏపీ-తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఏపీ మత్సకారుల చేపల వేటను అడ్డుకునేలా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి అసలు కారణం వేరే ఉంది. వాస్తవానికి ఈ ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ ఏటా లక్షలాది చేప పిల్లల్ని వేసేవి. కానీ ఇప్పుడు మారిన పరిస్దితుల్లో ఏపీ దానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే వేస్తున్న చేప పిల్లల్ని ఏపీ మత్సకారులు వేటాడటంపై తెలంగాణ మత్సకారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ సర్కార్ చేప పిల్లల్ని వేయకుండా చేపల వేటకు మత్సకారుల్ని ఎలా అనుమతిస్తుందని ప్రశ్నిస్తోంది. దీంతో ఈ వివాదం ఇరు రాష్ట్రాల మధ్య మరో చిచ్చు రాజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు ఏపీ సర్కార్ స్పందన ఆధారంగా భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉండబోతున్నాయి.