21 మంది ఎమ్మెల్యేలపై వేటు పడేనా?: కేజ్రీవాల్కు మరో షాక్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంసీడీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో విమర్శల పాలైన కేజ్రీవాల్కు మరోసారి ఎన్నికలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
21 మంది ఎమ్మెల్యేలకు పార్లమెంట్ కార్యదర్శుల హోదా కల్పించిన నేపథ్యంలో వారిని ఏ క్షణంలోనైనా అనర్హులుగా ప్రకటించే అవకాశముంది. దీంతో ఏఏపీకి మరో గండం ఎదురుకానుంది.
ఢిల్లీలో 70 స్థానాలకు 67 స్థానాల్లో ఏఏపీ గెలుపొందింది. 21మంది ఎమ్మెల్యేలను పార్లమెంట్ కార్యదర్శులుగా నియమించింది. ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పలువురు విమర్శించారు.
ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్ని చేపట్టారని, వారిపై అనర్హత వేటు వేయాలని పలు అభ్యర్థనలు దాఖలయ్యాయి. దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి తిరస్కరించడంతో పాటు ఎన్నికల సంఘానికి నివేదించారు.
దీంతో బంతి ఈసీ కోర్టుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే వచ్చే నెలలో 21 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశముంది.
అయితే, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎందుకంటే ఢిల్లీలో ఏఏపీకి పూర్తి మెజార్టీ ఉంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 67 ఏఏపీ గెలుచుకుంది. 21 మందిపై వేటు పడినా.. 46 మంది ఉంటారు. దీంతో ఇబ్బంది లేదు.