మహారాష్ట్రలో బీజేపీ మరో గేమ్ ? షిండే, ఉద్ధవ్ వర్గాలకు చెందిన 54 ఎమ్మెల్యేలకు నోటీసులు..
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు కొనసాగుతున్నాయి. గతంలో మహారాష్ట్ర సీఎం పదవి నుంచి ఉద్ధవ్ థాక్రేను దించేందుకు శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండే అనంతరం బీజేపీతో కలిసి సీఎం అయ్యారు. అప్పటి నుంచి ఇరువర్గాలకు మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో మరో పోరు మొదలైంది. అయితే ఇవాళ వీరిద్దరికీ ట్విస్ట్ ఇస్తూ బీజేపీ మరో పావు కదిపింది.
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసారు. ఈ 54 మంది ఎమ్మెల్యేలకు గతంలో తమపై వచ్చిన అనర్హత ఫిర్యాదులపై సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు స్పందించడానికి ఏడు రోజుల గడువు ఇచ్చారు. అనర్హతపై చర్య తీసుకోకుండా ఉండటానికి అవసరమైన అన్ని ఆధారాలను వారు సమర్పించాలని కోరారు.

ఈసీ నుంచి శివసేన రాజ్యాంగం కాపీ తనకు అందిందని స్పీకర్ నార్వేకర్ చెప్పడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏక్నాథ్ షిండే సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై త్వరలో కోర్టు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర స్పీకర్ జారీ చేసిన నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ గ్రూప్ ఎమ్మెల్యే అయిన ఆదిత్య థాక్రే.. త్వరలో బీజేపీ సీఎం ఏక్ నాథ్ షిండేను తప్పించబోతోందని ఇవాళ బాంబుపేల్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.
అజిత్ పవార్ వర్గం రాకతో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో పలు మార్పులు చోటు చేసుకుంటన్నాయి. త్వరలో తన కేబినెట్ విస్తరణకు సీఎం ఏక్ నాథ్ షిండే సిద్దమవుతున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ నేత ఫడ్నవీస్ కేంద్ర కేబినెట్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పవార్ ను ముఖ్యమంత్రి చేసే అవకాశాలూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications