మీరట్ 'లవ్ జిహాద్' కేసు: రేప్ పైన యువతి ట్విస్ట్
మీరట్: మీరట్ 'లవ్ జిహాద్' గ్యాంగ్ రేప్, కన్వర్షన్ కేసులో కొత్త ట్విస్ట్! బాధిత యువతి తాజాగా తన పైన ఎలాంటి అత్యాచారం జరగలేదని, అలాగే బలవంతంగా మతమార్పిడి చేయలేదని చెబుతున్నారు. ఇరవయ్యేళ్ల యువతిని పెళ్లి చేసుకొని, బలవంతంగా మతమార్పిడి చేసిన ఉదంతం కొద్దిరోజుల క్రితం మీరట్లో వెలుగు చూసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆమె తనను బలవంతం చేయలేదని ఆమె చెబుతున్నారు. తాజాగా బాధితురాలిగా భావిస్తున్న ఇరవయ్యేళ్ల యువతి మరో రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు.
తన కుటుంబ సభ్యులకు పలువురు రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి, అలా చెప్పమన్నారని ఆమె తన తాజా స్టేట్మెంట్లో తెలిపారు. బాధితురాలు తన కుటుంబ సభ్యుల పైన కూడా కేసు పెట్టారు. పోలీసులు బాధితురాలిని నారీ నికేతన్కు తరలించారు.
గతంలో బాధితురాలు మరో రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. నిందితుడు మొహమ్మద్ సనౌల్లా, అతని ఇద్దరు అనుచరులు తనను చితకబాదేవారని, తన పైన అత్యాచారం చేశారని ఆమె అప్పుడు చెప్పారు. జూలై 23వ తేదీన ఆమె వారి పైన స్టేట్మెంట్ ఇచ్చారు.
జూలై 26వ తేదీన మతమార్పిడికి బలవంతం చేశారని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొహమ్మద్ సనౌల్లను పోలీసులు ఆగస్టు 14వ తేదీన అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులు, బాధిత యువతి స్టేట్మెంట్లు వేర్వేరుగా ఉన్నాయి. కాగా, ఈ సంఘటన అప్పుడు స్థానికంగా సంచలనం, ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానిక బీజేపీ నేతలు లవ్ జిహాద్ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.