ఎవరు తిట్టినా పట్టించుకోను, మోడీ ఏంటో ఢిల్లీ చెప్పింది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తనను ఎవరు తిట్టినా పట్టించుకోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఓ ముఖాముఖి కార్యక్రమంలో అన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీలోని విభేదాల పైన స్పందిస్తూ.. ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తాను పరిపాలన పైనే దృష్టి పెట్టానన్నారు.
పార్టీలోని అంతర్గత వ్యవహారాలు పాలన పైన ప్రభావం చూపదన్నారు. పార్టీలో విభేదాలపై ప్రశ్నిస్తే.. సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. పరిపాలన పైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యల పైన చెప్పేందుకు ఏమీ లేదన్నారు.

మీడియాలో ప్రచారం కోసం కొందరు తనను ఏమైనా తిట్టవచ్చునని చెప్పారు. పబ్లిసిటీ కోసం సామాజిక అనుసంధాన వేదికల పైన తనను టార్గెట్ చేసుకోవడం కొందరికి సులభంగా కనిపిస్తోందని అన్నారు. తనకు ఎవరితోను గొడవ పెట్టుకోవాలని లేదన్నారు.
ప్రతి ఒక్కరికి కూడా తమ తమ హక్కులతో పాటు హద్దులు ఉంటాయన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓ పరిధి విధించిందన్నారు. తమ పార్టీలో విభేదాలు ఉంటే వాటిని తాము పరిష్కరించుకుంటామని చెప్పారు.
పది నెలల నరేంద్ర మోడీ పాలన పైన ఏం రేటింగ్ ఇస్తారని ప్రశ్నిస్తే.. ఢిల్లీ ఎన్నికల ద్వారా తెలిసిందని చెప్పారు. ప్రజాస్వామ్య పాలనలో ప్రజలే పాలన ఎలా ఉందో నిర్ణయిస్తారని చెప్పారు. మోడీ పాలన ఎలా ఉందో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిందన్నారు.












Click it and Unblock the Notifications