AP and TS Weather: ఆవర్తనం, అల్పపీడనం: ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతోతెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు, ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములతో కూడిన వానలు పడే అవకాశముందని పేర్కొన్నారు.
హైదరాబాద్ తోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో పలుచోట్ల జల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. రానున్న 48 గంటల్లో హైదరాబాద్ , ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు తీరంలో మరో ఆవర్తనం ఉంది. ఫలితంగా గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా మీదుగా తెలంగాణ వరకూ ఆవరించిన ఉపరితల ద్రోణి కారణంగా.. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు.
మరో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు
మరోవైపు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. మయన్మార్, గల్ఫ్ ఆఫ్ మార్టబన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 24వ తేదీ నాటికి అల్పపీడనంగా ఏర్పడి.. ఉత్తర ఒడిసా తీరం దిశగా పయనించనుందని చెప్పారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి.. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజులపాటు విస్తారంగా వర్షాలు
ఈ అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సహా, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. బుధవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయన్న వాతావరణ కేంద్రం.. సంబంధిత వర్షపాత వివరాలను ప్రకటించింది.
దీని ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో 5 సెంటీమీర్లకు పైగా వర్షపాతం నమోదైందన్నారు. అలాగే, మెదక్ జిల్లాలోని మిన్పూర్లో 7.5, రేణికుంటలో 9.03, కందిలో 6.15, ఖాసీంపేటలో 5.95, మిర్యాగూడలోని టీక్యాతండాలో 5.55 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఏపీలోనూ జోరు వానలు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు
ఇక, ఆంధ్రప్రదేశ్, యానాంలలో ప్రధానంగా నైరుతి గాలులు వీస్తున్నాయి. దక్షిణ తమిళనాడు తీరం దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీని ప్రభావం వల్ల రాగల 3 రోజులలో ఆంధ్రప్రదేశ్లో వాతావారణ పరిస్థితులు ఈ విధంగా ఉండనున్నాయి. గురు, శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గురు, శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, కడప జిల్లాలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.