అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: హైదరాబాద్లో ప్రజల ఇక్కట్లు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలు వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అల్పపీడనం ప్రభావంతోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో.పలుచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, పరిగి, అరకు, విజయవాడలో భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సోమవారం హైదరాబాద్లో పలుచోట్ల భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పటికీ.. సాయంత్రం వరకు వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. నల్లమబ్బులు పట్టి జోరుగా వాన పడింది. రాజేంద్రనగర్లో గంటసేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరదనీరు పొంగిపొర్లింది.
రాజేంద్రనగర్ వెళ్లే దారిలో పిల్లర్ నంబర్ 192 పీవీ ఎక్స్ప్రెస్ కింద మొకాల్లోతు నీరు నిలిచిపోయింది. వాహనదారులు ముందుకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిన ప్రతిసారీ ఇక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు వర్షంనీరు డ్రైనేజీలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇక శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లోనూ కుండపోతగా వాన కురిసింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యయాయి. పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి పలుకాలనీలు జలమయం అయ్యాయి. జాతీయరహదారిపై వర్షపునీరు నిలిచింది. శాంతినగర్కాలనీలో మురుగునీరు వీధుల్లోకి రావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వివేకానంద, బాహర్పేట్ చౌరస్తాలో రహదారులు చెరువులను తలపించాయి.
Recommended Video
మరోవైపు, ఏపీలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. విశాఖ జిల్లా అరకులో కుండపోత వర్షం కురిసింది. ఘాట్రోడ్డు వరదనీటితో నదిని తలపించింది. పై నుంచి ఉధృతంగా వరదనీరు వస్తుండటంతో వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి బాడవపేట గంగానమ్మ వీధిలో రేకుల ఇళ్లు కూలిపోయింది. ఇంట్లో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.