AP-TS Weather: ఉపరితల ద్రోణి ఎఫెక్ట్: ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులపాటు వర్షాలు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా విరామం ఇచ్చిన వర్షాలు మరోసారి పలకరిస్తున్నాయి. గత పది రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా తెలంగాణతో పాటు ఏపీలోనూ ప్రజలు, అధికారులు బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులు వర్షాలు విరామం ఇచ్చాయి. అయితే తాజాగా మరోసారి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావారణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం, సోమవారాల్లో ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు కురవనున్నట్లు తెలిపింది.
ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర ,యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావారణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షం పడే అవకాశాలున్నాయి.

కాగా, 06 అక్టోబర్ 2021నుంచి వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమునకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలో మరో 48 గంటలపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వరదల కారణంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రహదారులు దెబ్బతిన్నాయి.












Click it and Unblock the Notifications