2005లో రిజైన్ చేయాలనుకున్న కలాం, ఎందుకు?
ఢిల్లీ: దివంగత అబ్దుల్ కలాం 2005లో రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయాలనుకున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కలాం ఓ దశలో ఆ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ఆయన ప్రెస్ కార్యదర్శిగా పని చేసిన ఎస్ఎం ఖాన్ వెల్లడించారు.
బీహార్ అసెంబ్లీ రద్దును సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయాలని కలాం నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. అసలు బీహార్ అసెంబ్లీ రద్దుచేయడం అబ్దుల్ కలాంకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు.
ప్రభుత్వ సిఫార్సును తిరస్కరించే అవకాశం ఆయనకు ఉన్నప్పటికీ వరుసగా రెండోసారి కూడా ప్రభుత్వం నుంచి ఈ ప్రతిపాదన రావడంతో అనివార్య పరిస్థితుల్లో దానిపై సంతకం చేయాల్సి వచ్చిందన్నారు. ఎప్పుడైతే సుప్రీం కోర్టు బిహార్ అసెంబ్లీ రద్దును తిరస్కరించిందో కలాం అంతర్గతంగా చాలా మధనపడ్డారని చెప్పారు.
కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, అయితే సుప్రీం నిర్ణయంతో తన పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి కలాం వచ్చేశారని, ఇందుకు సంబంధించి తన సోదరుడిని కూడా సంప్రదించారని చెప్పారు.
అయితే తన రాజీనామా వల్ల రాజ్యాంగపరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశముందన్న ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారన్నారు. 2005లో అప్పటి బిహార్ గవర్నర్ బూటాసింగ్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని కేంద్రంలోని యుపిఏ సారథ్యంలోని మన్మోహన్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
ఆ సిఫార్సును మన్మోహన్ ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతికి పంపించింది. అయితే మాస్కో పర్యటనలో ఉన్న కలాం అక్కడి నుంచే దీనిపై సంతకం చేశారు. బిహార్ అసెంబ్లీ రద్దు వ్యవహారం రాజకీయ వివాదం రేకెత్తించడంతో వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది.
2005 డిసెంబర్ 7న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని తిరస్కరించింది. దీనివల్ల అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కలాం గురించి అనేక అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించిన ఎస్ఎం ఖాన్ ఆయనకు సంబంధించిన ఎన్నో వ్యక్తిగత అంశాలను వెల్లడించారు.
కలాంకు సొంతంగా ఏదీ లేదని, ఓ ఇల్లుగానీ, కారుగానీ, టీవీగానీ, రిఫ్రిజిరేటర్ కూడా ఉండేది కాదన్నారు. తన మొత్తం జీవితాన్ని శాస్తవ్రేత్తగా, ఉపాధ్యాయుడిగానే గడిపారని, హోటళ్లలోనూ, అతిథి గృహాల్లోనే ఉండేవారన్నారు. అయితే, ఆయనకున్న సొంత ఆస్తి పుస్తకాలేనని, ఏ పుస్తకాన్నైనా సొంతంగా కొనుక్కోవాలి తప్ప ఎవరినుంచో దానిని తీసుకోకూడదన్న నియమాన్ని చివరి వరకు కలాం పాటించారన్నారు.