అమ్మ వైద్యానికి అయిన ఖర్చు రూ.80కోట్లు.. రోజుకు కోటి..
చెన్నై: 75రోజుల పాటు అపోలో ఆసుపత్రి చికిత్సలో పొంది చివరికి నాటకీయ పరిణామాల నడుమ జయలలిత కన్నుమూసిన విషయం తెలిసిందే. చివరి రోజుల్లో ఆమెకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాకపోవడం.. మరణం తర్వాత అనేక అనుమానాలు తలెత్తుతుండడంతో అమ్మ మరణం ఇంకా వార్తల్లో నానుతూనే ఉంది.
తాజాగా అపోలో ఆసుపత్రిలో అమ్మకు జరిగిన చికిత్స గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. జయ చికిత్సకైన ఖర్చు రూ.80కోట్లు అనేది దాని సారాంశం. సమాచార హక్కు చట్టం ఆధారంగా ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్తో ఈ విషయం వెలుగుచూసినట్టుగా తెలుస్తోంది. కాగా, 75రోజుల చికిత్సకు ఏకంగా రూ.80కోట్ల వైద్య ఖర్చు కావడం ఇప్పుడు ప్రతీ ఒక్కరిని విస్మయానికి గురిచేస్తోంది.
అయితే ఈ బిల్లు కేవలం అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన బిల్లు మాత్రమే. ఇతరత్రా ఖర్చులను కలుపుకుంటే ఈ బిల్లు మరింతగా పెరిగే అవకాశముంది. ఇప్పటికైతే రూ.6కోట్ల బిల్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చెల్లించినట్టు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల వైద్య ఖర్చులను ప్రభుత్వాలే భరిస్తాయి కాబట్టి.. మిగతా బిల్లును కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
జయలలిత ఆసుపత్రిలో చేరిన రెండో రోజే అపోలోలోని రెండో అంతస్తును ఖాళీ చేయించడంతో.. ఆ అంతస్తులోని 30 గదుల అద్దెను జయ వైద్య ఖర్చుల్లోనే కలిపారు. ఒకరోజుకు గాను వీటి అద్దె రూ.కోటి. ఎక్మో, ఇతర లైఫ్ సపోర్టు వంటి వైద్య పరికరాల చార్జీలు అదనం.
వీటితో పాటు అపోలో వైద్యులకు కన్సల్టేషన్ చార్జీలు, మందులు, నర్సింగ్ చార్జీలు, లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బీలే, అతని బృందం, సింగపూర్ ఫిజియోథెరిపిస్టుల చార్జీలు, జయ భద్రతా సిబ్బందికి చెల్లించాల్సిన బేటాలు అన్ని కలుపుకుని ఖర్చు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.