'నరేంద్ర మోడీ! పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకోండి'
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అప్పుడే విజ్ఞప్తులు అందుతున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి కూటమి తరఫున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామ జోగయ్య ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో... పవన్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, రాజకీయాలకు ఆయన సేవలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మొదటిరోజు మహానాడులో తీర్మానాలు
అవినీతిరహిత భారతదేశం, ఎన్నికల ఫలితాలు, పార్టీ విజయం అనే తీర్మానాలను తెలుగు దేశం పార్టీ మహానాడు ఏకగ్రీవంగా ఆమోదించింది. మంగళవారం గండిపేట తెలుగు విజయంలో ప్రారంభమైన మహానాడు సందర్భంగా ఎన్నికల ఫలితాలు, పార్టీ విజయం తీర్మానంపై ప్రసంగించిన చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. తీర్మానాన్ని ప్రతిపాదించిన మోహన్ రావు ప్రసంగిస్తూ పోరాటాలకు బాబు మారుపేరని అన్నారు.
ఎమ్మెల్యే పీతల సుజాత ప్రసంగిస్తూ ఫాంహౌజ్లో కూర్చుంటే అధికారం రాలేదని, చంద్రబాబు రాత్రింభవళ్ళు కష్టపడ్డారని, పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. కాల్వ శ్రీనివాస్ ప్రసంగిస్తూ జగన్ పార్టీలా తమ పార్టీ సంతలో కొన్నట్లు అభ్యర్థులను కొనలేదని అన్నారు. ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ప్రసంగిస్తూ తెలుగు యువతను పటిష్టపరచాలని కోరారు. తెలంగాణలో టిడిపిని పునర్ నిర్మాణం చేయాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో మరణించి కింజారపు ఎర్రన్నాయుడు తనయుడు, ఎంపి కె రాంమోహన్ నాయుడు ప్రసంగిస్తూ ఇది విజయోత్సవ మహానాడు అన్నారు. 2019 ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించేలా అందరూ ఇప్పటి నుంచే కష్టపడాలని ఆయన కోరారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య రాజ్యాంగపరమైన గీత గీసినా, అది మనుషుల మధ్య కాదని అన్నారు. అవినీతిరహిత భారతదేశం తీర్మానాన్ని ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి ప్రతిపాదించారు.