చైనా బోర్డర్ లో తాజా పరిస్ధితి ఇదీ-ఆర్మీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు-తూర్పులడఖ్ లో రెండ్రోజుల టూర్
భారత్-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద పరిస్దితులు రోజురోజుకూ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య బలగాల ఉపసంహరణ ఒప్పందాలు కుదురుతున్నా చైనా మాత్రం అదనపు బలగాల మోహరింపులు చేస్తోంది. అదే సమయంలో భారత్ లోని ఉత్తరాఖండ్ కు చైనా ఆర్మీకి చెందిన వంద దళాలు గుర్రాలపై వచ్చి వెళ్లాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో చైనా సరిహద్దుల్లో పరిస్ధితులపై ఉత్కంఠ పెరుగుతోంది.
చైనా సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ లో మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో ఆర్మీ ఛీఫ్ ఎంఎం నరవణే ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు అక్కడ పర్యటిస్తున్నారు. వాస్తవ పరిస్ధితుల్ని తెలుసుకునేందుకు స్వయంగా అక్కడకు వెళ్లిన ఆర్మీ ఛీఫ్.. ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. చైనా దూకుడుపై వారితో చర్చించారు. సరిహద్దుల్లో శీతాకాల పరిస్ధితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వారికి గుర్తు చేశారు. అనంతరం అక్కడి పరిస్ధితులపై అర్మీ ఛీఫ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో వాస్తవ పరిస్ధితిని ఈ వ్యాఖ్యలు అద్దం పట్లేలా ఉన్నాయి.

చైనా సైన్యం భారీగా బలగాలను తరలించేందుకు వీలుగా తమ వైపు భారీ ఎత్తున మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటుందని ఆర్మీ ఛీఫ్ నరవణే తెలిపారు. కానీ తమ బలగాలు కూడా బలంగానే ఉన్నాయన్నారు. మనం కూడా అత్యాధునిక ఆయుధాలను తరలిస్తునట్లు ఆయన వెల్లడించారు. చైనా సరిహద్దుల్లో పరిస్దితులు ప్రస్తుతానికి నియంత్రణలోనే ఉన్నాయని అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనల్ని అయినా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వ సన్నద్ధంగా ఉందన్నారు. మరోవైపు సరిహద్దుల్లో పరిస్ధితుల్ని దీర్ఘకాలం ఎదుర్కొనేందుకు వీలుగానే తమ ఏర్పాట్లు ఉన్నాయన్నారు. అలాగే ఈ సమస్యకు పరిష్కారం కోసం చైనాతో తదుపరి రౌండ్ మిలటరీ కమాండర్ స్ధాయి చర్చల్లో ప్రయత్నాలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 12 రౌండ్ల చర్చలు జరిగాయని, మరిన్ని దఫాలుగా చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు.
చైనా నుంచి ముప్పు మాత్రం ఇంకా తొలగిపోలేదని, ఆయితే భారత ఆర్మీ కూడా ఎలాంటి పరిస్ధితుల్ని అయినా ఎదుర్కొనేందుకు దీర్ఘకాల సన్నద్ధతతోనే ఉందని ఆర్మీ ఛీఫ్ నరవణ్ తెలిపారు.












Click it and Unblock the Notifications