ఎన్ఆర్సీ,సీఏఏ : బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు గట్టి షాక్ ఇచ్చిన కేరళ..
జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు,ప్రజా సంఘాలు ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఈ చట్టాలతో దేశ ప్రజలకు ఎలాంటి నష్టం లేదని, ఇవి ఏ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకువచ్చిన చట్టాలు కావని చెబుతోంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ఆయా రాష్ట్రాల్లో క్యాంపెయిన్స్ కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కేరళలోనూ ఎన్ఆర్సీ,సీఏఏలకు మద్దతుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభించింది. అయితే ఈ క్యాంపెయిన్కు కేరళ ప్రజల నుంచి గట్టి షాక్ తగిలింది.

ఏం జరిగింది :
ఎన్ఆర్సీ,సీఏఏలకు మద్దతుగా బీజేపీ,ఆర్ఎస్ఎస్ వాటి అనుబంధ సంస్థలు నిర్వహిస్తున్న డోర్ టు డోర్ క్యాంపెయిన్ను వ్యతిరేకిస్తూ కోజికోడ్ జిల్లాలోని కరాది గ్రామంలో దాదాపు 350 ఇళ్లు తమ ఇంటి గేట్లకు ఒక బోర్డు తగిలించాయి. 'సీఏఏ,ఎన్ఆర్సీ,ఎన్పీఆర్లను తిరస్కరించండి' అని ఆ బోర్డులపై రాసి ఉంది. ఆపై మలయాళంలో 'ఈ చట్టాలు రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమన్న అవగాహన మాలో ఉంది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మా ఇళ్లకు వచ్చి వాటి గురించి వివరించాల్సిన పనిలేదు.'అని రాసి ఉంది. అంతేకాదు, అక్కడే ఆగిపోండి అని అర్థం వచ్చేలా 'స్టాప్' అనే సిగ్నల్ను కూడా బోర్డుపై ముద్రించారు.

మరిన్ని ప్రాంతాల్లో :
కోజికోడ్ జిల్లాలోని పలు గ్రామాల్లోనూ ఇలాంటి పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఎన్ఆర్సీ,సీఏఏ,ఎన్పీఆర్లను ముస్లిం కుటుంబాలు కూడా స్వాగతిస్తున్నాయంటూ బీజేపీ-ఆర్ఎస్ఎస్ బుక్లెట్ ప్రచారం మొదలుపెట్టడంతో అక్కడి ప్రజలు అప్రమత్తమయ్యారు. పేద ముస్లింలను పట్టుకుని.. వారి చేతుల్లో ఎన్ఆర్సీ,సీఏఏ అనుకూల బుక్లెట్ పెట్టి ఫోటోలు తీస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని,దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

ఎమ్మెల్యే ఫోటోలు :
తమను ఫోటోలు తీస్తుంటే నిస్సహాయంగా చూస్తుండిపోవడం తప్ప ఆ పేద ముస్లింలు ఏం చేయగలరని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి చెందిన ఆజాద్ కరాదీ అన్నారు. వాళ్ల గురించి పక్కనపెట్టండి.. ఆఖరికి స్థానిక ఎమ్మెల్యే,సున్నీ నాయకుడు కరత్ రజాక్ తమ ఇళ్లల్లో పర్యటించినప్పుడు తీసిన ఫోటోలను కూడా వారు తమ అనుకూల ప్రచారానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. తన ఫోటోలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ చేస్తున్న పోస్టర్ ప్రచారాన్ని కరత్ రజాక్ ఖండించారు.

ఇది మొదటిసారి కాదు :
జమ్మూకశ్మీర్లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారిపై రేప్ జరిగిన సమయంలోనూ కేరళవాసులు ఇలాంటి పోస్టర్లతో బీజేపీకి షాక్ ఇచ్చారు. 'మా ఇళ్లల్లో పదేళ్ల వయసున్న ఆడపిల్లలు ఉన్నారు. దయచేసి బీజేపీ కార్యకర్తలు మా ఇళ్లలోకి రావద్దు' అంటూ ఇంటి గేట్లకు పోస్టర్స్ తగిలించారు. ఏదేమైనా పౌరసత్వ చట్టాలకు జనం మద్దతు కూడగట్టేందుకు బీజేపీ చేస్తున్న పోస్టర్స్ ప్రచారంపై అక్కడ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి తిరస్కారం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications