జయప్రదను అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశాలు
లక్నో: ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జయప్రదకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఈఎస్ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన ఆమెకు.. తాజాగా మరో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులో భాగంగా జయప్రదను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలంటూ రాంపుర్ ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపుర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు జయప్రద. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి.

అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా జయప్రద స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. అంతకుముందు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, ఆమెను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ, ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.
కాగా, తెలుగువారికి సుపరిచి నటి అయిన జయప్రద తెలుగుతోపాటు దేశంలోని ఇతర భాషల చిత్రాల్లోనూ నటించారు. ఆమె 300కుపైగా చిత్రాల్లో నటించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జయప్రద. టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరి, రాంపుర్ లోక్సభ ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు ఆమె రాంపుర్ ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరారు. రాంపూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.












Click it and Unblock the Notifications