130కోట్ల భారతీయులు ఆత్మవిశ్వాసంతో ఆ సవాళ్లను ఎదుర్కొన్నారు : మోదీ
ఓవైపు దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో.. ఎన్పీఆర్ కూడా వాటికి తోడైంది. ఎన్పీఆర్ ఎన్ఆర్సీకి దొడ్డిదారి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆ రెండింటికీ అసలు సంబంధమే లేదని చెబుతోంది. అయినా దేశంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉండగా.. వాటి నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇవన్నీ చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
విమర్శలు,ఆరోపణల సంగతెలా ఉన్నా దేశంలోని 130కోట్ల మంది భారతీయులే ఈ సవాళ్లన్నింటికీ ఆత్మవిశ్వాసంతో పరిష్కారం కనుగొన్నారని తాజాగా ప్రధాని మోదీ అన్నారు. తద్వారా తాము ప్రవేశపెడుతున్న చట్టాలకు మెజారిటీ ప్రజల మద్దతు ఉందని పరోక్షంగాఉటంకించారు.ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అటల్ బిహారీ మెడికల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సందర్భంగా మోదీ మాట్లాడారు.
ఆర్టికల్ 370 రద్దు,రామ మందిర నిర్మాణం వంటి సమస్యలు శాంతియుతంగా పరిష్కరించబడ్డాయని అన్నారు. అలాగే పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించే విషయం కూడా క్లియర్ అయిపోయిందన్నారు. ఇలాంటి సవాళ్లన్నింటికీ 130 కోట్ల మంది భారతీయులు ఆత్మవిశ్వాసంతో పరిష్కారం కనుగొన్నారని అభిప్రాయపడ్డారు.
ఇక ఉత్తరప్రదేశ్లో ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడంపై మోదీ సున్నితంగా స్పందించారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినవారు,హింసకు పాల్పడ్డవారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మంచి రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ పౌరుల హక్కులని, అదే సమయంలో వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తుచేశారు. అలాగే నాణ్యమైన విద్య కూడా పౌరుల హక్కు అని,అదే సమయంలో విద్యా సంస్థల రక్షణ.. ఉపాధ్యాయులు,అధ్యాపకుల పట్ల గౌరవం మన బాధ్యత అని గుర్తుచేశారు. శాంతియుత వాతావరణాన్ని కోరుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు అని, అదే సమయంలో పోలీస్ విధులను కూడా గౌరవించాలని సూచించారు.