రీల్ ‘శ్రీరాముడు’ అరుణ్ గోవిల్ బీజేపీలో చేరిక: జై శ్రీరామ్ అంటూ నినాదం, బెంగాల్లో ప్రచారం
న్యూఢిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో భారతయ జనతా పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ అసోంను విడదీసింది.. బీజేపీ మాత్రం కలిపింది: ప్రధాని మోడీ
బీజేపీలో చేరిన అరుణ్ గోవిల్..
తాజాగా, ప్రముఖ నటుడు, టెలివిజన్లో ప్రసారమవుతున్న రామాయణంలో 'శ్రీరాముడు'గా కనిపించి టీవీ రాముడిగా పేరు తెచ్చుకున్న అరుణ్ గోవిల్ బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతల సమక్షంలో గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
జైశ్రీరాం నినాదాలు.. బీజేపీ తరపున బెంగాల్లో ప్రచారం
జై శ్రీరాం నినాదాలు చేయడంలో ఎలాంటి తప్పులేదని అరుణ్ గోవిల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బీజేపీ ర్యాలీలు, సభల్లో జై శ్రీరామ్ నినాదాలు వినిపించడం సాధారణమైన విషయమే. కాగా, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. సుమారు 100 ర్యాలీల్లో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టీవీ ‘శ్రీరాముడి'గా పేరొందిన అరుణ్ గోవిల్..
1987లో ప్రసారమైన ప్రముఖ ధారావాహిక 'రామాయణ్'లో శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్ అందరికీ సుపరిచితమే. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆ ధారావాహికను పలు టీవీ ఛానళ్లు మరోసారి ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సీరియల్కు హైయెస్ట్ రేటింగ్ రావడం గమనార్హం. రామాయణ్ తర్వాత పలు హిందీ, భోజ్పురి, ఒడియా, తెలుగు సినిమాల్లోనూ నటించారు. ఎక్కువగా ఈయన పౌరాణిక చిత్రాల్లోనే నటించారు.
అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ
కాగా, ప్రస్తుతం బీజేపీలో చేరిన అరుణ్ గోవిల్.. 1980లో గోవిల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం గమనార్హం. నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాను బీజేపీలో చేరినట్లు ట్విట్టర్ వేదకిగా అరుణ్ గోవిల్ పేర్కొన్నారు. కాగా, బీజేపీలో చేరిన అరుణ్ గోవిల్ కు ఆ పార్టీ నేతలు స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక రామాయణ్లో రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది, సీతగా నటించిన దీపికా ఛిఖాలియాకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. వారిద్దరూ కూడా ఎంపీలుగా ఎన్నికయ్యారు. కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్ తోపాటు అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.