ట్విస్ట్: మోడీ ఇంటికి కేజ్రీ, సమాధానం చెప్పాలని సవాల్
అహ్మదాబాద్: అభివృద్ధిని పరిశీలిస్తానని నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ట్విస్ట్ ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిని తాను కలుస్తానని గాంధీ నగర్లోని ఆయన నివాసానికి కేజ్రీవాల్ బయలుదేరారు.
దీంతో గుజరాత్ పోలీసులు కేజ్రీవాల్ను మోడీ ఇంటికి సమీపంలో అడ్డుకున్నారు. గుజరాత్లో అభివృద్ధి ఉన్నదని మోడీ చెబుతున్నారని, అదంతా అబద్దమని కేజ్రీవాల్ ఆరోపించారు. మోడీ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మోడీ తనను కలిసేందుకు అనుమతిస్తే కలుస్తానని లేదంటే అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తానని చెప్పారు.

కేజ్రీవాల్ను కలిసేందుకు నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో కేజ్రీవాల్ అహ్మదాబాద్ తిరుగు పయనమయ్యారు.
కేజ్రీవాల్ తీరుపై బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పార్టీ నేత కేజ్రీవాల్ స్టంట్స్ చేస్తున్నారని జైట్లీ మండిపడ్డారు. మోడీని కలవాలని కేజ్రీవాల్ పట్టుబట్టడం పబ్లిక్ స్టంట్ అని బిజెపి నేతలు ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications