ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జైట్లీ, పీవీకి ఇవ్వకపోవడం వెలితని కేసీఆర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో లోపాలు నిజమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఢిల్లీలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీల పెంపుపై జరిగిన లోపాలను సవరించామని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీల పెంపుపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
తద్వారా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీల సంఖ్య 50 నుండి 58కు పెరగనుంది. కాగా, ఎఫ్డీఐల పైన అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీమా రంగంలో 49 శాతం ఎఫ్డీఐలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. రాజ్యసభలో ప్రతిపక్షాల గందరగోళం నేపథ్యంలో బిల్లు తేలేకపోయామని చెప్పారు.
బీమా ఎఫ్డీఐలను సెలక్ట్ కమిటీ ఓకే చేసిందని తెలిపారు. కాగా, ప్రతిపక్షాల వ్యతిరేకత కారణంగా బీమా బిల్లును కేంద్రం సభలో ప్రవేశ పెట్టలేదు. పార్లమెంటు ముగిసిన మరుసటి రోజే ఆర్డినెన్స్ బిల్లును తీసుకు వచ్చింది.
భారత రత్నపై కేసీఆర్

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, మదన్ మోహన్ మాలవ్యాలకు భారతరత్న ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాదులో స్పందించారు.
వాజపేయి, మాలవ్యాలకు భారతరత్న ఇవ్వడం సముచితమే అన్నారు. అలాగే, దివంగత నేత, తెలంగాణ కాంగ్రెస్ నేత పీవీ నర్సింహా రావుకు కూడా భారతరత్న పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వక పోవడం వెలితిగా ఉందన్నారు.
మాలవ్యా మనవడి ఆనందం
మదన్ మోహన్ మాలవ్యాకు భారతరత్న ఇవ్వడం హర్షణీయమని ఆయన మనవడు గిరిధర్ మాలవ్యా అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాలవ్యాకు భారతరత్న ఇవ్వడం దేశానికి దక్కిన గౌరవమన్నారు. రాజకీయంగానే కాదు, పాత్రికేయుడు, న్యాయవాది, సంఘసంస్కర్త, విద్యావేత్తగా ఆయన కీర్తి గడించారన్నారు. కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోడీకి అయన ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications