నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత టార్గెట్ అవే: మరో బాంబు పేల్చిన జైట్లీ
ముంబై: పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత మోడీ సర్కారు మరో కీలక అంశం మీద దృష్టిపెట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కుదిపేసే నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
రాజకీయ విరాళాలను ప్రక్షాళన చేయడం తమకు ఇప్పుడు అత్యధిక ప్రాధాన్య అంశమంటూ రాజకీయా పార్టీల గుండెల్లో మరో బాంబు పేల్చారు. జీఎస్టీ అమలు వ్యవహారం మొత్తం పూర్తయిన తర్వాత ప్రభుత్వం చేపట్టే కొన్ని కీలకమైన చర్యల వల్ల మొత్తం రాజకీయ విరాళాల వ్యవస్థ ప్రక్షాళన అవుతుందని స్పష్టం చేశారు.
70 ఏళ్ల క్రితం ఉన్న ఈ విరాళాల వ్యవస్థ వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశానికి ఎలాంటి పేరు రావట్లేదని, అందువల్ల ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ప్రధాని మోడీ చెబుతున్నారని తెలిపారు. అంతేగాక, ఈ చర్యకు ప్రజామద్దతు కూడా బలంగా ఉందని జైట్లీ తెలిపారు.
రాజకీయ పార్టీలకు విరాళాలను నగదు కాకుండా ఎలక్టొరల్ బాండ్ల రూపంలో ఇవ్వాలని బడ్జెట్లో జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి నియమ నిబంధనల రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది.
అయితే బాండ్లతో రాజకీయ విరాళాలలో పారదర్శకత తేవాలన్న ప్రయత్నాలపై ప్రతికూల ప్రభా వం పడుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ చెబుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం దీనిపై ప్రత్యామ్నాయ మార్గాలను ఏమైనా పరిశీలించే అవకాశం ఉంది.