నీచమే నేటి రాజకీయమా?: కేజ్రీని ఏకేసిన జైట్లీ
న్యూఢిల్లీ: డీడీసీఏ వ్యవహారంలో తనపై విమర్శలు గుప్పిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీచ రాజకీయాలకు పాల్పడాలని ఏమైనా నిబంధన పెట్టుకున్నారా? అంటూ ప్రశ్నించారు.
కేజ్రీవాల్, ఇతర ఆప్ సభ్యులు ఢిల్లీ అసెంబ్లీ బయట, లోపల.. వాడుతున్న భాషను ఇతర ప్రభుత్వ శాఖల్లో వాడగా తానెప్పుడూ వినలేదన్నారు. ఒక హోదాలో ఉన్న వ్యక్తులు నిగ్రహం పాటించాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేశారు.
తనపై వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దిగజారి నీచంగా మాట్లాడుతున్నారని, కానీ అలాంటివి సత్యాన్ని ఏం చేయలేవని అన్నారు. వారు చేసే ఆరోపణలకు ఎలాంటి ప్రత్యేక కారణాలు ఉండవని తన ఫేస్బుక్ బ్లాగ్లో పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ విజయం చూసి కాంగ్రెస్ తప్పుదోవపడుతున్నట్లుందని, తిడితేనే ఓట్లు వస్తాయని ఆ పార్టీ భావిస్తున్నట్లుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక ప్రధాన మంత్రి, ఇతర నేతల గురించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా గౌరవప్రదమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి(కేజ్రీవాల్) అలాంటి మాటలేనా మాట్లాడేది? అని ప్రశ్నించారు.
ఇక తమ పార్టీ నేతలపై వేటు వేయడంపై కూడా జైట్లీ స్పందిస్తూ పార్టీ అధ్యక్షుడు(అమిత్ షా) ఏనాడో హెచ్చరించారని, పార్టీకిగానీ, పార్టీకి సంబంధించిన వ్యక్తులకుగానీ నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడవద్దని అన్నారని గుర్తు చేశారు. నాడు చేసిన హెచ్చరిక నేడు దృశ్య రూపంలో కనిపించిందని అన్నారు.
డీడీసీఏకి జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అందులో భారీ అవినీతి, అవకతవకలు చోటుచేసుకున్నాయని ఇటీవల కేజ్రీవాల్ ఆరోపించారు. వాటితో ప్రత్యక్షంగా, పరోక్షంగా జైట్లీకి సంబంధాలు ఉన్నాయంటూ ఆయన విమర్శలు గుప్పించడం, జైట్లీ ఆయనపై పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.