రాజీనామా తొందరపాటే: అంగీకరించిన కేజ్రీవాల్
అమృత్సర్: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం తొందరపాటు చర్యనేనని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. కాంగ్రెస్, బిజెపిలు జతకట్టి తమను ఏ పనీ చేయకుండా అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 50 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అమృత్ సర్ లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మరికొన్నాళ్లు పదవిలోనే ఉండి, ప్రత్యేక సమావేశాల ద్వారా ప్రజలకు నిజానిజాలు వెల్లడించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బిజెపిలపై ఆయన మరోసారి ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని దోచుకోవడంలో ఇరు పార్టీలకూ పెద్దగా తేడా లేదని ఆయన వ్యాఖ్యానించారు.
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేద్ర మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఇద్దరినీ ఓడిస్తేనే దేశంలో పురోగతి సాధ్యమని కేజ్రీవాల్ అన్నారు. మన దేశాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్, బిజెపిలను మట్టి కరిపించాల్సిందేనని కేజ్రీవాల్ అన్నారు.
కాంగ్రెసు, బిజెపిలను ఓడించడానికి అన్ని వర్గాల ప్రజలూ సంఘటితం కావాలన్నారు. తమ పార్టీ ఏం చేసినా అది ప్రజల మేలు కోసమేగానీ, తమ కోసం కాదని కేజ్రీవాల్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ అమృత్ సర్ అభ్యర్థి దల్జీత్ సింగ్ కు మద్దతుగా ప్రచారం చేయడం కోసం వచ్చిన కేజ్రీవాల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఎకనమిక్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్యూలోనూ ఆయన అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
అర్థాంతరంగా రాజీనామా చేయడం వల్ల ప్రజలకు, తమకూ మధ్య అంతరం ఏర్పడిందని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉంటామని ఆయన ఎకనమిక్ టైమ్స్ ఇంటర్వ్యూలో చెప్పారు.