మా పార్టీని ఖతం చేయడానికి సుపారీ తీసుకుంది: మీడియాపై కేజ్రీవాల్ భగ్గు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ మళ్లీ నోరు జారారు. మీడియాలోని ఒక వర్గం కిరాయి తీసుకుని అప్ ను అంతం చెయ్యాలని స్కెచ్ వేసిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అప్ మీద లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా బీజేపీ నాయకుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
న్యూఢిల్లీలో అరవింద్ క్రేజీవాల్ యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ ప్రారంభించారు. ఈ సందర్బంలో ఆయన మాట్లాడుతూ మీడియా మీద నిప్పులు చెరిగారు. ఢిల్లీలో అప్ ను అంతం చెయ్యడానికి మీడియాలోని ఒక వర్గం కిరాయి తీసుకుందని ఆరోపించారు.
మీడియాలోని ఒక వర్గం నిత్యం అప్ పార్టీ మీద లేని పోని ఆరోపణలు చేస్తు నిరాదారమైన వార్తలు ప్రసారం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరికి సంబంధించిన అవినీతి వార్తలను మీడియా ప్రసారం చెయ్యడం లేదని అన్నారు.
గడ్కరి మీద ప్రేమ చూపించి తమ మీద ఆరోపణలు చేస్తున్నారని, దీనిమీద బహిరంగ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మంత్రి వర్గంలోని న్యాయశాఖ మంత్రి తోమర్ మీద వచ్చిన ఆరోపణలను అరవింద్ క్రేజీవాల్ ఖండించారు.
ఇదంతా మీడియా సృష్టి అని ఆరోపించారు. బీహార్ యూనివర్శిటి తప్పుడు సమాచారం ఇచ్చి మంత్రి తోమర్ రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ తీసిందని ఆరోపించారు. తమ పార్టీని భూస్థాపితం చెయ్యడానికి వీరు కంకణం కట్టుకున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ మండిపడ్డారు.