మూడు జిల్లాల అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న పెద్దపులి
ఛత్తీస్గఢ్ అడవుల నుంచి జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన ఒక పులి గత ఆరు నెలలుగా ఏలూరు, పోలవరం మరియు తూర్పుగోదావరి జిల్లాల ప్రజలను భయపెడుతోంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలో ఈ పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దాని కదలికలను ఎప్పటికప్పుడు గమనించి సురక్షిత చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలు నిరంతరం పని చేస్తున్నాయి.
గతంలో పట్టుకుని అభయారణ్యంలో వదిలేసిన పులి
ఈ పులి మొదట ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోకి ప్రవేశించి, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో తిరిగింది. జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా వైపు వెళ్లింది. అక్కడ రాయవరం సమీపంలో సంచరించడంతో అటవీ శాఖ అప్రమత్తమై పుణె నుంచి నిపుణుల బృందాన్ని రప్పించి పులిని బంధించింది. ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసి విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలలో కొంతకాలం ఉంచి, ఫిబ్రవరిలో పోలవరం జిల్లా పాపికొండల అభయారణ్యంలో వదిలేశారు.

మళ్ళీ అటవీ సరిహద్దు గ్రామాల్లో పశువులను టార్గెట్ చేస్తున్న పులి
అయితే అభయారణ్యంలో వదిలిన తర్వాత కూడా పులి అడవుల్లోనే ఉండలేదు. ఏప్రిల్ 14న గోదావరి నదిని దాటి కొత్తూరు ముంపు గ్రామం వైపు వచ్చి దూడను చంపింది. తర్వాత పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో తిరిగి ఏప్రిల్ 21న సింగన్నపల్లి దగ్గర మళ్లీ గోదావరిని దాటి పూడిపల్లి గ్రామంలో సంచరించింది. ఇటీవలి 21న సిరివాక సమీపంలో గోదావరిని దాటి ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండల అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది.
పులి సంచారంతో అటవీసరిహద్దు గ్రామాలలో టెన్షన్
పులి తరచూ గ్రామాల సమీపానికి వచ్చి పశువులపై దాడి చేయడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రైతులు, పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పులి కదలికలను ఖచ్చితంగా గమనించడానికి అటవీ శాఖ అధునిక సాంకేతికతను వాడుతోంది.
బెంగళూరు నిపుణులతో కలిసి ప్రత్యేక రెస్క్యూ బృందాలు పులి కోసం సెర్చ్ ఆపరేషన్
విశాఖ జూలో మెడకు అమర్చిన సౌరశక్తి కాలర్ ఐడీ సూర్యరశ్మి తగిలినప్పుడల్లా సమాచారం పంపుతుంది. ట్రాకర్ పరికరాలు 500 మీటర్ల పరిధిలో పులి ఉనికిని గుర్తిస్తాయి. మంగళగిరి అటవీ ప్రధాన కార్యాలయంలో శాటిలైట్ ద్వారా వచ్చే సంకేతాలను ప్రత్యేక యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన నిపుణులతో కలిసి ప్రత్యేక రెస్క్యూ బృందాలు పని చేస్తున్నాయి. పులి అడవుల్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అయితే గ్రామస్తులు ఒంటరిగా అడవులకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని, పులి కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications