రాజ్యతంత్రంలో రాచఠీవి.. మన నెమళ్లు ఇక ఐక్యరాజ్యసమితిలో
ప్రపంచ దేశాల మధ్య శాంతి, సామరస్యాలను పెంపొందించే ఐక్యరాజ్యసమితి ఆవరణ.. ఇప్పుడు మన దేశ జాతీయ పక్షి నృత్యాలతో కళకళలాడనుంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న ఐరాస కార్యాలయానికి భారత్ ఐదు అందమైన నెమళ్లను బహుమతిగా అందించింది. భారత్, ఐక్యరాజ్యసమితి మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన బంధానికి, దౌత్య సంబంధాలకు ఈ ప్రత్యేకమైన కానుక ఒక సరికొత్త చిహ్నంగా నిలిచింది. మన దేశ సంస్కృతిలో, పౌరుల హృదయాల్లో అత్యంత ప్రత్యేక స్థానం ఉన్న నెమళ్లను ఐరాసకు అందించడం పట్ల ప్రపంచ వేదికపై హర్షం వ్యక్తమవుతోంది.
ఒక్కటిగా మిగిలిన వేళ... ఐదు నెమళ్ల ఎంట్రీ
జెనీవాలోని ఐరాస ప్రధాన ప్రాంగణమైన 'అరియానా పార్క్'లో ఒకప్పుడు ఎన్నో నెమళ్లు విహరించేవి. అయితే కాలక్రమేణా వాటి సంఖ్య తగ్గిపోయి, చివరికి ఒకే ఒక్క నెమలి మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో పార్కుకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడానికి భారత్ ఈ ఐదు చిన్న నెమళ్లను అందించింది. ఇందులో నాలుగు నీలిరంగు నెమళ్లు కాగా, ఒకటి అత్యంత అరుదైన తెల్లటి మగ నెమలి కావడం విశేషం. ఐక్యరాజ్యసమితి అధికారిక రంగులైన 'నీలం-తెలుపు' కలయికలోనే ఈ పక్షులు ఉండటంతో ఐరాస ప్రతినిధులు మురిసిపోతున్నారు.

ఇందిరా గాంధీ నాటి సంప్రదాయం పునరావృతం
జెనీవా ఐరాస కేంద్రంలో నెమళ్లను పెంచడం వెనుక దశాబ్దాల చరిత్ర ఉంది. 1981లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కూడా జెనీవా కార్యాలయానికి ఒక జత నెమళ్లను కానుకగా ఇచ్చారు. ఆ పాత సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ ఇప్పుడు మళ్లీ ఐదు నెమళ్లను అందించడం అదృష్టంగా భావిస్తున్నామని ఐరాసలోని భారత దౌత్యవేత్తలు తెలిపారు. అసలు ఈ స్థలంలో నెమళ్లు విహరించాలనే ఆచారం 1890 నుంచే ఉందట! ఈ పార్కును నగరానికి విరాళంగా ఇచ్చిన 'గుస్తావ్ రెవిలియోడ్' అనే భూస్వామి.. ఈ స్థలంలో ఎప్పుడూ నెమళ్లు స్వేచ్ఛగా తిరగాలనే నిబంధన పెట్టడంతో నాటి నుంచి నేటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.
కొత్త వాతావరణానికి అలవాటు... ఆపై స్వేచ్ఛాయుత విహారం
ప్రస్తుతానికి ఈ ఐదు పక్షులను పార్కులోని ఒక పెద్ద విశాలమైన తాత్కాలిక నివాసంలో ఉంచారు. ఇక్కడి వాతావరణానికి, వృక్షసంపదకు అలవాటు పడటానికి వీలుగా మూడు నెలల పాటు వాటిని అందులోనే ఉంచుతారు. అనంతరం పార్కంతా స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతిస్తారు. జెనీవా బయోపార్క్కు చెందిన ప్రత్యేక అంబులెన్స్లో, నిపుణులైన పశువైద్యుల పర్యవేక్షణలో వీటిని సురక్షితంగా జెనీవాకు తరలించారు. పెద్ద పెద్ద చెట్లు, పచ్చిక బయళ్ళు ఉన్న ఈ పార్కు నెమళ్లకు సరైన నివాసమని వైద్యులు చెబుతున్నారు.
నక్కల భయం... జెనీవాలో పేరు పెట్టే పండగ!
ఇవన్నీ ఇంకా చిన్న వయసు ఉన్న మగ నెమళ్లు కావడంతో, అడవి నక్కల వంటి క్రూర మృగాల నుంచి వీటిని కాపాడుకోవడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. చెట్ల కొమ్మలపై బాగా ఎత్తులో నిద్రించడం అలవాటయ్యే వరకు వైద్య బృందం వీటిని నిశితంగా పరిశీలించనుంది. ఐదు పక్షులూ మగవే కావడంతో ఇవి గుంపుగా కలిసి ఉండేందుకు ఆస్కారం ఉందన్నారు. త్వరలోనే ఈ ఐదు కొత్త 'దౌత్యవేత్తల'కు పేర్లు పెట్టడానికి ఐరాస ఒక బహిరంగ పోటీని కూడా నిర్వహించబోతోంది.




Click it and Unblock the Notifications