కేజ్రివాల్ సంచలనం-ఢిల్లీలో నిర్మాణ పనుల నిలిపివేత-వర్కర్లకు నెలకు రూ.5వేలు
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య భూతం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యానికి కారణమవుతున్న భవన నిర్మాణ పనుల్ని నిలిపేయాలని నిర్ణయించింది.
Construction activities have been stopped across Delhi in view of pollution. I have directed Labour Minister, Sh Manish Sisodia, to give Rs 5000 pm as financial support to each construction worker during this period, when construction activities are not permitted
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 2, 2022
ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా భవన నిర్మాణ పనుల్ని నిలిపేస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇవాళ ట్వీట్ చేశారు. ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కూడా అయిన మనీష్ సిసోడియాను ఆదేశించినట్లు ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీలో నిర్మాణ పనులు నిలిచిపోనున్నాయి.అదే సమయంలో భవన నిర్మాణంపై ఆధారపడిన కార్మికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. వారంతా పనిలేక పస్తులుండాల్సి వస్తుంది. దీంతో ఆప్ సర్కార్ మరో నిర్ణయం కూడా తీసుకుంది.
ఢిల్లీలో భవన నిర్మాణ పనుల్ని నిరవధికంగా నిలిపేసిన ఆప్ సర్కార్.. ఈ రంగంపై ఆధారపడిన కార్మికులకు నెలకు రూ.5 వేల చొప్పున భృతి ఇవ్వాలని నిర్ణయించింది. అంటే ఈ నిర్ణయం అమల్లో ఉన్నంతవరకూ వారు ఇళ్లలోనే ఉంటూ రూ.5 వేల భృతి తీసుకోవచ్చు. ఈ మేరకు అధికారులకు ఆప్ సర్కార్ ఆదేశాలు జారీ చేస్తోంది. తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని సీఎం అరవింద్ కేజ్రివాల్ తన ట్వీట్ లో తెలిపారు.