"ఆదిత్యా బిర్లా గ్రూప్ నుంచి 25కోట్లు లంచంగా తీసుకున్న మోడీ"
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడుతున్న సమయంలో మోడీపై కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆదిత్యా బిర్లా గ్రూప్ నుంచి రూ.25కోట్లు ఆయనకు ముడుపుల రూపేణా అందాయని ఆరోపించారు.
తనవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తనవద్ద ఉన్నాయని కొన్ని పత్రాలను అసెంబ్లీ ముందుంచారు కేజ్రీవాల్. ఆదిత్యా బిర్లా గ్రూప్ కు అప్పట్లో అధ్యక్షుడిగా వ్యవహరించిన శుబేందు అమితాబ్ పై ఐటీ దాడులు జరిగిన సమయంలో.. ఈ ముడుపుల వ్యవహారం వెలుగుచూసిందని తెలిపారు. శుబేందుకు చెందిన ల్యాప్ టాప్ లు, బ్లాక్ బెర్రీ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. వాటిలో డేటాను విశ్లేషించి చూడగా.. ఆదిత్యా గ్రూప్ నుంచి రూ.25కోట్లు మోడీ లంచంగా తీసుకున్నారని వెల్లడైనట్టుగా పేర్కొన్నారు.
ఈ ఆరోపణలకు సంబంధించి ఐటీ శాఖ జారీ చేసిన ఎనాలిస్ కాపీని కూడా అసెంబ్లీలో చదివి వినిపించారు కేజ్రీవాల్. సామాన్య ప్రజలను, పేద వర్గాలను దోచుకుని తన కార్పోరేట్ సన్నిహిత వర్గానికి ప్రయోజనం చేకూరేలా మోడీ వ్యవహరిస్తున్నారని ఈ సందర్బంగా ఆరోపించారు. అందుకే వ్యాపారవేత్తల నుంచి ఆయనకు ముడుపులు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ, మోడీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.!