కేజ్రీవాల్కు కోర్టు నోటీసులు: జైట్లీకి మోడీ మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం(డిడిసిఏ)లో అవినీతి జరిగిందని, అందుకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీని బాధ్యుడిని చేస్తూ ఆప్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే అరుణ్జైట్లీ ఆప్ నేతలపై పరువునష్టం దావా వేశారు. ఈ దావాకు సంబంధించి న్యాయస్థానం మంగళవారం కేజ్రీవాల్ సహా ఐదుగురు ఆప్ నేతలకు నోటీసులు జారీచేసింది.
జైట్లీకి మోడీ మద్దతు
ఢిల్లీ క్రికెట్ సంఘం ఛైర్మన్గా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు మద్దతుగా నిలిచారు. జైట్లీ కడిగిన ముత్యంలా ఆరోపణల నుంచి బయటపడతారని మోడీ అన్నారు.
హవాలా కేసులో అద్వానీలాగే జైట్లీ కూడా ప్రతిపక్షాల ఆరోపణలనుంచి నిర్దోషిగా బయటపడతారని బిజెపి పార్లమెంటరీ సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వ కీర్తికి భంగం కలిగించడానికి జైట్లీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్, ఆప్లపై విమర్శలు చేశారు.
సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జైట్లీ ఈ వివాదం నుంచి బయటపడతారని మోడీ వెల్లడించినట్లు తెలిపారు. గతంలో సుష్మాస్వరాజ్, శివరాజ్సింగ్ చౌహాన్, వసుంధర రాజేలపై కూడా ప్రతిపక్షాలు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశాయని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు.