కేజ్రివాల్ పాజిటివ్ పాలిటిక్స్-నల్లజెండాలతో బీజేపీ క్యాడర్ నిరసన-పార్టీలో చేర్చుకుంటానని హామీ
ఢిల్లీ, పంజాబ్ లో విజయాల తర్వాత దేశంలో బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయగల నేతగా పేరు తెచ్చుకుంటున్న అరవింద్ కేజ్రివాల్ ఈసారి గుజరాత్ లో విజయంపై దృష్టిపెట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే పలు ఉచిత పథకాలను ప్రకటించిన కేజ్రివాల్.. తాజాగా కరెన్సీ నోట్లపై ఇండోనేషియా తరహాలో వినాయకుడు, లక్ష్మీదేవి ఫోటోలు ముద్రించాలని డిమాండ్ చేసి సంచలనం రేపారు. ఇదేక్రమంలో కేజ్రివాల్ ఇవాళ మరో ప్రయత్నం చేశారు.
గుజరాత్ లోని నవసారి జిల్లాలో ప్రచారం కోసం వస్తున్న అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బృందాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నిరసనల మధ్యే చిక్లీలో బహిరంగసభ ప్రాంగణానికి చేరుకున్న కేజ్రివాల్.. ఆ తర్వాత ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన బీజేపీ కార్యకర్తల్ని ఉద్దేశించి కేజ్రివాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్లజెండాలతో తనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారు తనకు సోదరులతో సమానమని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు.

తన పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలుతెలిపిన వారిపై తనకు ఎలాంటి కోపం లేదని కేజ్రివాల్ తెలిపారు. మీరు ఎవరికోసమైనా పనిచేసుకోండి, ఏ పార్టీకైనా ఓటువేసుకోండి, మేం అధికారంలోకి వస్తే మాత్రం మీ పిల్లల స్కూళ్లు బాగుచేస్తామని కేజ్రివాల్ తెలిపారు. అలాగే ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. మిమ్మల్ని కుటుంబ సభ్యుల్లాగే చూస్తామన్నారు. ఏదో ఒక రోజు మీ మనసులు మార్చి మిమ్మల్ని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేలా చేస్తానని కేజ్రివాల్ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications