నా రేఖ పెద్దగాఉంది, భయమొద్దు: కేజ్రీవాల్ చమత్కారం
న్యూఢిల్లీ/హైదరాబాద్: భద్రతను తిరస్కరిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్.. తన గురించి ఆందోళన చెందవద్దని పోలీసులకు సూచిస్తున్నారు. తన భద్రత గురించి ఆందోళన చెందవద్దని పోలీసులకు తాజాగా మరోసారి చెబుతూ ఆయన తన జీవన రేఖను పొడుగ్గా ఉందంటూ చేయి చూపించి సరదాగా వ్యాఖ్యానించారు.
పలువురి ఒత్తిడికి తలొగ్గి తొలుత ఇల్లు మారడానికి అంగీకరించిన కేజ్రీవాల్ తిరిగి శ్రేయోభిలాషులు ఇచ్చిన సూచనల మేరకు దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. అంత కన్నా చిన్న ఇల్లు చూడమని ఆయన అధికారులకు సూచించారు కూడా. కాగా, జనవరి 10 నుండి దేశవ్యాప్త ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. 10 నుండి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
మరోవైపు, ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన ఎఎపి ఆంధ్రప్రదేశ్లో తన కదలికలు ప్రారంభించింది. శనివారం హైదరాబాద్లో, విశాఖపట్నంలో ఆప్ సమావేశాలు జరిగాయి. కేజ్రీవాల్ ఆదర్శంగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉన్న వారు విశాఖలో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎఎపి తరఫున ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన అభిషేక్ పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీని ప్రజలు సొంత పార్టీలా భావిస్తున్నారని, వారికి అర్థమయ్యే రీతిలో చెబితే తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణ భారత రాజకీయ సలహాదారు పురుషోత్తం మాట్లాడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అన్ని రకాల మనుషులు అవసరమని, ఆ తరహా ఆలోచన ఉన్నవారంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి డాక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.
హైదరాబాద్లో ఎఎపి రాష్ట్ర కోఆర్డినేటర్ అర్షద్ హుసేన్ మొగల్పూరలో సమావేశం నిర్వహించారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే 35 వేల మంది సభ్యత్వం తీసుకున్నారని తెలంగాణ ప్రాంత కోఆర్డినేటర్ అజిత్ సింగ్ తెలిపారు. పాతబస్తీలో ఎఎపికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని చార్మినార్ నియోజకవర్గ సమన్వయకర్త అబ్బాస్ తెలిపారు.