బాబ్బాబు.. ఢిల్లీ మున్సిపోల్స్ నిర్వహించండి.. మోడీకి కేజ్రీవాల్ రిక్వెస్ట్
పంజాబ్ విజయంతో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మంచి జోష్లో ఉన్నారు. ఇక ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీని కోరుతున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను వాయిదా వేస్తే ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసినట్టేనని కామెంట్ చేశారు. ఢిల్లీలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వాటన్ని విలీనం చేసే బిల్లును తెస్తామని బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని విషయాలనూ విశ్లేషించి ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది.
అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. విలీనం చేయాలని అనుకున్నప్పుడు ఏడేళ్లూ ఏం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పటి నుంచి కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా? అని నిలదీశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆప్ వేవ్ ఉందనే విషయం బీజేపీకి అర్థమైందని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఓడిపోతామనే భయంతోనే వాయిదా వేసిందని ఆరోపించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేస్తే అన్నీ కలిసి ఒకే ఆఫీసుగా మారిపోతాయి. ఉద్యోగులు అందరూ ఒకే ఆఫీసులో పనిచేస్తారు. అలాంటి దాని కోసం ఎన్నికలను ఎందుకు వాయిదా వేయడం? రేపటి రోజున రత్ పార్లమెంటరీ వ్యవస్థ నుంచి అధ్యక్ష వ్యవస్థకు మారితే కూడా.. ఎన్నికలు పెట్టరా? రెండు రాష్ట్రాలను విలీనం చేస్తే కూడా ఎన్నికలు నిర్వహించరా? అని ప్రశ్నించారు.
ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీకి చేతులెత్తి మొక్కుతున్నానని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని, దేశమే ముఖ్యం అని, రాజకీయ పార్టీలు కాదని అన్నారు. ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి చేస్తే.. ఆ వ్యవస్థ బలహీనం అవుతుందని అన్నారు. వ్యవస్థలను బలహీన పరచలేమని, దాని వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని అన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలని లేఖ అందిన గంటలో నిర్ణయం తీసుకున్నారని, అలా బలహీనపడిపోతే మన దేశానికే నష్టం అన్నారు.