మరోసారి ఎన్బీబీ ముందుకు ఆర్యన్ ఖాన్-లాయర్ తో కలిసి హాజరు-హైకోర్టు బెయిల్ షరతులో భాగంగా
ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు దొరికిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ముంబై హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందిన ఆర్యన్ ఖాన్.. బెయిల్ షరతుల్లో భాగంగా ఇవాళ ఎన్సీబీ విచారణకు హాజరయ్యాడు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన 22 రోజుల తర్వాత ఆర్యన్ ఖాన్ కు బోంబే హైకోర్టులో అక్టోబర్ 30న బెయిల్ లభించింది. అయితే బెయిల్ షరతుల్లో భాగంగా వారానికోసారి విచారణకు హాజరు కావాలని కోర్టు షరతు విధించింది. దీంతో ఆర్యన్ ఖాన్ బెయిల్ లభించాక తొలిసారి ఎన్సీబీ ముందు హాజరయ్యాడు. తన లాయర్ నిఖిల్ మనేషిండేతో కలిసి తెల్లరంగు రేంజ్ రోవర్ కారులో దక్షిణ ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వచ్చిన ఆర్యన్.. కాసేపు విచారణ తర్వాత తిరిగి వెళ్లిపోయాడు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఇద్దరు మిత్రులు మున్ మున్ థమేచా, అర్బాజ్ మర్చంట్ లకు బెయిల్ ఇచ్చిన బోంబే హైకోర్టు మొత్తం 14 షరతులు విధించింది. ఇందులో ఎన్సీబీ విచారణకు వారానికోసారి హాజరుకావడం కూడా ఉంది. ప్రతీ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు విచారణకు హాజరై వెళ్లాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆయన తన పాస్ పోర్టును ఎన్సీబీ అధికారులకు అప్పగించడంతో పాటు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించింది. దీంతో ఇవాళ ఆర్యన్ ఎన్సీబీ ఆఫీసుకు వచ్చాడు.
ఈ కేసులో ఆర్యన్ తో పాటు మొత్తం 20 మందిని ఎన్సీబీ ఇప్పటివరకూ అరెస్టు చేసింది. వీరిపై డ్రగ్స్ కలిగి ఉండటంతో పాటు సేవించడం, క్రయ విక్రయాలు చేయడం, కుట్రకు పాల్పడటం వంటి కేసుల్ని నమోదు చేసింది. వీటికి బలమైన ఆధారాలు కూడా ఉండటంతో ఇప్పుడు షారుక్ తనయుడు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు. ఎన్సీబీ పెట్టిన సెక్షన్లు, మోపిన ఆరోపణల ప్రకారం చూస్తే ఇప్పట్లో ఆర్యన్ కు విముక్తి లభించేలా కనిపించడం లేదు.