భావోద్వేగం తట్టుకోలేక.. సీఎం చూస్తుండగానే వెక్కి వెక్కి ఏడ్చిన నేత..
యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముందే ఓ సమాజ్ వాది నేత వెక్కి వెక్కి ఏడ్చాడు. మైకులో ప్రజలకు ధన్యవాదాలు చెబుతూనే మధ్యలో మాట్లాడడం ఆపేసి ఏడవడం మొదలెపెట్టాడు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారాలు విభిన్నంగా దర్శనం ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని తీరులో ప్రచార హోరు కొనసాగుతుండగా విచిత్ర, అనూహ్య దృశ్యాలకు తావిస్తున్నాయి.
ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో శైలిలో ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఏకంగా ఓటర్ల ముందు భోరున ఏడుస్తున్నారు. తాము గతంలో తప్పు చేశామని, ఈ ఒక్కసారి క్షమించి అధికారం ఇవ్వాలంటూ తమ చెప్పులతో తమనే కొట్టుకుంటూ ఔరా అనిపిస్తున్నారు.
తాజాగా యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముందే ఓ సమాజ్ వాది నేత వెక్కి వెక్కి ఏడ్చాడు. కారణం చెప్పకుండా మైకులో ప్రజలకు ధన్యవాదాలు చెబుతూనే మధ్యలో మాట్లాడడం ఆపేసి ఏడవడం మొదలెపెట్టాడు.
సొంత పార్టీలోనే తనకు అసమ్మతి ఎదురైన కారణంగా ఆయనకు జరిగిన అవమానాలు గుర్తొచ్చి ఏడ్చారని ఆయనతో ఉన్న ఇతర నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అసలేం జరిగిందంటే...
సమాజ్ వాది పార్టీ తరుపున బార్హాజ్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగాడు. ఆరో దశలో భాగంగా ఇక్కడ శనివారం ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడికి ప్రచారానికి వచ్చిన నరేంద్రమోడీ.. ఈ స్థానం తప్పనిసరిగా బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేసి వెళ్లిపోయారు.
ఆ తరువాత ప్రచారంలో భాగంగా అక్కడికే వచ్చిన అఖిలేష్ యాదవ్ పీడీ తివారీకి భరోసా ఇచ్చారు. ప్రజలు తమ విశ్వాసాన్ని ఓటు రూపంలో తివారీకి అందించాలని వ్యాఖ్యానించారు. 'ఈ ఎన్నికల్లో బీజేపీ సీట్లన్నీ కొల్లగొడుతుందని చెప్పారు.. బార్భాజ్ సీటును ఎలా కొల్లగొడతారో మనమూ చూద్దాం..' అని వ్యాఖ్యానించారు.
ఈ మాటలు వినగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున తివారీకి మద్దతుగా చప్పట్ల శబ్దాలు, ఈలలు వినిపించాయి. అఖిలేష్ అలా అన్న తరువాత భావోద్వేగం ఆపుకోలేక పీడీ తివారీ వెక్కివెక్కి ఏడ్చాడు. అంతకుముందు సుజాత్ అలాం అనే వ్యక్తి తన చెప్పులతో తానే పదే పదే తలపై కొట్టుకుని 'ఈ ఒక్కసారికి క్షమించండి..' అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసిందే.