శివసేన కొలికి: అమిత్ షా ముంబై పర్యటన రద్దు
ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఒక్క మెట్టు కూడా దిగి రావడానికి శివసేన సుముఖంగా లేదు. దాంతో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ముంబై పర్యటన రద్దయింది. ఆయన బుధవారం సాయంత్రం ముంబై రావాల్సి ఉంది. అయితే, సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
మహారాష్ట్ర శాసనసభకు అక్టోబర్ 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల సర్దుబాటులో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి అమిత్ షా ముంబై వస్తారని భావించారు. అయితే, శివసేన దిగి రాకపోవడంతో ఆయన తన పర్యటనను గురువారానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
బిజెపి, శివసేన గత 25 ఏళ్లుగా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. మహారాష్ట్ర శాసనసభలో 288 స్థానాలున్నాయి. అయితే, మెజారిటీ సీట్లకు పోటీ చేసి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలనే ఉద్దేశంతో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఉన్నారు. 150కి ఏ మాత్రం తగ్గబోమని ఆయన కచ్చితంగా చెబుతున్నారు.
బిజెపి 130 స్థానాలకు, శివసేన 151 స్థానాలకు పోటీ చేయడానికి ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు మంగళవారం వార్తలు వచ్చాయి. అయితే, మహాయుతి కూటమిగా ఏర్పడిన చిన్న పార్టీలు దానికి అంగీకరించడం లేదు. ఆ కూటమిలో ఉన్న నాలుగు పార్టీలు 18 సీట్లు అడుగుతున్నాయి. తాజా ఫార్ములాలో వాటికి ఏడు సీట్లు మాత్రమే కేటాయించారు. అందుకు ఆ పార్టీలు అంగీకరించకపోవడంతో సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన ఏర్పడింది.
ఈ సాయంత్రం 6 గంటలలోగా తమ విషయం తేల్చకపోతే పొత్తు నుంచి తప్పుకుంటామని ఆ పార్టీలు గడువు పెట్టాయి. అయితే తాము సీట్లను తగ్గించుకోవడానికి సిద్ధంగా లేమని శివసేన తెగేసి చెప్పింది. తాము ఇప్పటికే 18 సీట్లు వదులుకున్నామని, చిన్న పార్టీలకు మరో ఐదు సీట్లు బిజెపి ఇవ్వాలని శివసేన అంటోంది.
నాలుగు పార్టీలను బుజ్జగించడానికి శివసేన, బిజెపి కూడా రంగంలోకి దిగాయి. సీట్ల సర్దుబాటులో తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవడానికి వాటికి మరో మూడు రోజుల గడువు ఉంది. ఈ నెల 27వ తేదీన నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తాము కూటమి చవి చూసిన అత్యంత క్లిష్టమైన సంక్షోభం ఇదేనని శివసేన, బిజెపి అంటున్నాయి. అయితే, ఎన్సీపి, కాంగ్రెసు మధ్య సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి రాకపోవడం ఈ కూటమికి ఊరట కలిగించే విషయం.