'బ్లాక్ ఫంగస్'పై అలర్ట్... కేంద్రం కీలక సూచనలు... తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు...
దేశమంతా కరోనాపై పోరాడుతున్న వేళ 'బ్లాక్ ఫంగస్'(మ్యుకోర్మైకోసిస్) రూపంలో మరో పెను సవాల్ ఎదురవుతోంది. కరోనా నుంచి కోలుకున్నవారు ఈ ఇన్ఫెక్షన్ బారినపడుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే గుజరాత్,ఢిల్లీ,మహారాష్ట్ర,కర్ణాటక,తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం 'బ్లాక్ ఫంగస్'పై ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
మ్యుకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి...
కేంద్రమంత్రి షేర్ చేసిన సమాచారం ప్రకారం... దీర్ఘకాలిక వ్యాధులు,ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. పర్యావరణ వ్యాధికారకాలతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే డయాబెటీస్ నియంత్రణలో లేనివారికి,దీర్ఘకాలం ఐసీయూలో చికిత్స పొందినవారికి,చికిత్సలో భాగంగా తాత్కాలికంగా రోగ నిరోధక శక్తిని అణచివేసే స్టెరాయిడ్స్ తీసుకున్నవారికి బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉంది.

బ్లాక్ ఫంగస్ లక్షణాలు...
బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకినవారిలో కళ్లు ఎర్రబడటం,కళ్ల చుట్టూ నొప్పి,జ్వరం,తలనొప్పి,దగ్గు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,రక్తపు వాంతులు,మానసిక స్థితిపై ప్రభావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మ్యూకస్ వల్ల ముక్కు బ్లాక్ అయినంతమాత్రాన... అలాంటి కేసులన్నీ బాక్టీరియల్ సైనసటిస్గా భావించవద్దు. ముఖ్యంగా కోవిడ్ చికిత్స తీసుకునే పేషెంట్లకు... చికిత్సలో భాగంగా రోగ నిరోధక శక్తిని తాత్కాలికంగా అణచివేసే లేదా క్రమబద్దీకరించేలా కొన్ని రకాల డ్రగ్స్ ఇస్తారు. ఇవి తీసుకున్నవారిలో ముక్కు బ్లాక్ అవడం వంటి లక్షణాలు కనిపిస్తే... అలాంటి కేసులన్నీ బాక్టీరియల్ సైనసటిస్గా భావించవద్దు.

త్వరగా గుర్తిస్తే వ్యాధి నుంచి బయటపడవచ్చు..
'సరైన అవగాహన,త్వరగా వ్యాధిని గుర్తించడం ద్వారా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చు..' అని కేంద్రమంత్రి హర్షవర్దన్ పేర్కొన్నారు.బ్లాక్ ఫంగస్ కొత్త వ్యాధి ఏమి కాదని... దీనికి చికిత్స కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే సకాలంలో దీన్ని గుర్తించకపోయినా,చికిత్స అందించకపోయినా ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.కరోనా చికిత్స సమయంలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల కొంతమంది పేషెంట్లు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ బారినపడుతున్నట్లు మెడికల్ పరిశోధనలు చెబుతున్నాయి.
Recommended Video

దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న కేసులు
కొద్దిరోజుల క్రితం మొదట గుజరాత్లో 40-45 బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఇందులో కొంతమంది కంటిచూపు కూడా కోల్పోయారు. ఆ తర్వాత కర్ణాటక,మహారాష్ట్ర,మధ్యప్రదేశ్, తెలంగాణలో కేసులు వెలుగుచూశాయి. తెలంగాణలోని భైంసాలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడగా ఇందులో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం గాంధీలో మరో ముగ్గురు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకిన పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications