బార్ లైసెన్సులు: మరో మంత్రి రూ. 10 కోట్లు డిమాండ్!
తిరువనంతపురం: బార్ లైసెన్సులు పునరుద్దించేందుకు లంచం డిమాండ్ చేశారని కేరళ ఎక్సైజ్ శాఖ మంత్రి కే.బాబు మీద ఆరోపణలు వచ్చాయి. బార్ లైసెన్సులు పునరుద్దించేందుకు మంత్రి బాబు రూ. 10 కోట్లు లంచం డిమాండ్ చేశారని వెలుగు చూసింది.
రూ. 50 లక్షలు లంచం కేరళ సచివాలయంలోనే మంత్రి కే. బాబుకు అందించామని ఓ హోటల్ యజమాని బిజు రమేష్ ఆరోపిస్తున్నాడు. మిగిలిన రూ. 9.50 కోట్లు లంచం ఇవ్వడానికి మిగిలిన హోటల్ యజమానులతో తాను సంప్రదింపులు చేశానని రమేష్ మీడియాకు చెప్పారు.
అయితే ఈ ఆరోపణలపై మంత్రి కే. బాబు స్పందించారు. బిజు రమేష్ కు చెందిన 9 బార్లు మూయించినందుకే తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అతను కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు.
తన మీద చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఎందుకు వాటిని కోర్టులో ఇవ్వలేదని ప్రశించారు. గతంలో కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి కే. బాబు మీద బిజు రమేష్ పలు ఆరోపణలు చేశారు. విజిలెన్స్ అధికారులు సైతం దర్యాప్తు చేసి చివరికి సాక్షాలు లేవని కోర్టులో చెప్పారు.
బార్ లైసెన్సులు పునరుద్దించేందుకు లంచాలు తీసుకున్నారని ఆరోపణలు రావడంతో కేరళ ఆర్థిక శాఖ మంత్రి కే.ఎం. మణి రాజీనామా చేసిన వెంటనే మరో మంత్రి మీద రమేష్ ఆరోపణలు చెయ్యడంతో అక్కడి ప్రభుత్వం ఉలిక్కిపడింది.
కేరళలో యూడీఎఫ్ కూటమి అధికారంలో ఉంది. కాంగ్రెస్ తో పాటు 7 పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. వచ్చే ఆరు నెలల్లో కేరళలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బలో వరుస పెట్టి సీనియర్ మంత్రుల మీద లంచాలు డిమాండ్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ బార్ లైసెన్సుల లంచాల కేసులో నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిగితే కేరళ సీఎం ఊమెన్ చాందీ కూడా నిందితుడు అవుతాడని సీపీఎం నాయకుడు కొడియెరి బాలకృష్ణన్ అంటున్నారు. ఇప్పుడు కొంతే బయటపడిందని, వీరికి ముందుంది ముసళ్లపండగ అని కొడియెరి బాలకృష్ణన్ చెబుతున్నారు.