థాకరే + థాకరే: రాజ్కు ఉద్ధవ్ ఫోన్ , మళ్లీ ఏకం?
ముంబై: బిజెపితో తెగదెంపులు చేసుకున్న తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరేను దువ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తన కజిన్, రాజకీయ ప్రత్యర్థి అయిన రాజ్ థాకరేకు ఆయన రెండు సార్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
ఉద్ధవ్ ఫోన్ చేసిన విషయాన్ని శివసేన వర్గాలు అంగీకరిస్తూనే రాజకీయాలతో దానికి సంబంధం లేదని అంటున్నాయి. మలేరియాతో జబ్బు పడిన రాజ్ థాకరే ఆరోగ్యం గురించి ఉద్ధవ్ అడిగారని అంటున్నాయి. రాజ్ థాకరే ఔరంగాబాదులోని ఓ కార్యక్రమంలో పడిపోయారు కూడా.
రాజ్ థాకరేను 2005లో బాల్ థాకరే వారసుడిగా పరిగణించేవారు. అయితే, రాజ్ థాకరే బయటకు వచ్చి మహారాష్ట్ర నవ నిర్మాణ సేనను స్థాపించారు. 2012లో బాల్ థాకరే మరణించినప్పుడు సోదరులిద్దరు ఒక చోటికి వచ్చారు. కానీ, రాజకీయంగా దూరం పాటిస్తూ వచ్చారు.
లోకసభ ఎన్నికల్ల శివసేన 22 సీట్లకు పోటీ చేసి 18 సీట్లు గెలుచుకుంది. బిజెపి 24 సీట్లలో విజయం సాధించింది. రాజ్ థాకరే ఎంఎన్ఎస్ పది సీట్లకు పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.