నుపుర్ శర్మ అరెస్టుకు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్-అరబ్ దేశాల్లో భారత్ పరువుపోయిందని వ్యాఖ్య
మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై అరబ్ దేశాలతో పాటు దేశంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కోట్లాది మంది ముస్లింలకు ఆరాధ్యుడైన ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు.
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గల్ఫ్ దేశాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని ఇబ్బందికరమైన స్థితిలోకి నెట్టివేసిన బిజెపి అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్టు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. "భారతదేశం పరువు కోల్పోయింది. దేశ విదేశాంగ విధానాన్ని నాశనం చేశారు. నేను నుపుర్ శర్మ సస్పెన్షన్ మాత్రమే కాకుండా అరెస్టును డిమాండ్ చేస్తున్నాను, "అని ఒవైసీ అన్నారు.
అదే సమయంలో అసదుద్దీన్... విదేశాంగ మంత్రిత్వ శాఖపై కూడా గురి పెట్టారు, "విదేశాంగ శాఖ బిజెపిలో భాగమైందా? గల్ఫ్ దేశాల్లో భారతీయులపై విద్వేషపూరిత నేరాలు, హింస చోటుచేసుకుంటే మీరేం చేస్తారని ప్రశ్నించారు. ఉద్రేకపూరిత ప్రకటనలు చేయడానికి బిజెపి ఉద్దేశపూర్వకంగా తన అధికార ప్రతినిధులను పంపుతుందని, అంతర్జాతీయ వేదికపై తన నేతల వ్యాఖ్యలు వివాదాస్పదమైన తర్వాతే చర్య తీసుకుంటుందని హైదరాబాద్ ఎంపీ ఆరోపించారు.
మహమ్మద్ ప్రవక్తపై ఆరోపించిన అవమానకరమైన వ్యాఖ్యల కారణంగా భారతదేశం ఎదుర్కొన్న అవమానాలు , మందలింపులను ఒవైసీ గుర్తుచేశారు ఖతార్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గౌరవార్థం విందు రద్దు చేశారని, రెండు గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు తమ నిరసనను తెలియజేయడానికి భారతీయ రాయబారులను పిలిపించాయని ఓవైసీ తెలిపారు.