విహెచ్పి నేత అశోక్ సింఘాల్ కన్నుమూత
గుర్గావ్: తీవ్ర అనారోగ్యంతో గుర్గావ్లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కాగా, 89ఏళ్ల సింఘాల్ వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో అక్టోబరు 20న ఇదే ఆస్పత్రిలో చేరి నాలుగు రోజుల కిందే ఇంటికొచ్చారు.
మళ్లీ అస్వస్థతకు గురికావడంతో గత శనివారం ఇదే ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్పై కృత్రిమ శ్వాస అందించామని, అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారని వైద్యులు తెలిపారు.
కాగా, 1926లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మెటాలార్జికల్ ఇంజినీరింగ్ విద్య పూర్తి చేశారు. డిగ్రీ అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ప్రచారక్గా వ్యవహరించారు.
1981లో విహెచ్పి జాయింట్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. అనంతరం విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఆయన దాదాపు 20ఏళ్లపాటు సేవలందించారు.
తీరని లోటు: మోడీ సంతాపం
అశోక్ సింఘాల్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఆయన మృతి తనకు వ్యక్తిగతంగానూ, దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశానికి సేవచేసేందుకు తన జీవితాన్ని ధార పోశారని, ఆయనొక వ్యవస్థ అని కొనియాడారు.
సింఘాల్ ఎల్లప్పుడూ తనకు మార్గదర్శనం చేస్తుండేవారని చెప్పారు. కొన్ని తరాలకు సింఘాల్ స్పూర్తిగా నిలుస్తారని ట్విట్టర్ లో తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మోడీ అన్నారు.