తాజ్ మహల్ ఇంటి పన్ను బాకీ- వడ్డీతో కలిపి: 15 రోజుల్లోగా కట్టకపోతే- యోగి సర్కార్ కొరడా..!!
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సాంస్కృతిక, వారసత్వ కట్టడాలకు పన్నును విధించే కార్యక్రమానికి తెర తీసింది. చారిత్రాత్మక కట్టడం- తాజ్ మహల్తో దీనికి శ్రీకారం చుట్టింది. తాజ్ మహల్పై లక్షా 47 వేల రూపాయల ఇంటి పన్నును విధించినట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందంటూ హుకూం జారీ చేసింది యోగి సర్కార్.
మరో వారసత్వ కట్టడం ఇత్తెమాద్- ఉద్- దౌలాపైనా ఇలాంటి పన్నునే విధించారు ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఈ రెండింటికీ సంబంధించిన పన్ను బకాయిల మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత పురావస్తు శాఖపై ఉంది. తాజ్ మహల్ పురావస్తు శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉన్నందున, వారికి నోటీసులను పంపించారు. ఓ చారిత్రాత్మక కట్టడంపై పన్నును విధించడం ఈ శతాబ్దంలోనే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ లక్షా 47 వేల రూపాయల్లో అసలు చెల్లించాల్సిన మొత్తం 88,784 రూపాయలు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 88,784 రూపాయల ఇంటి పన్ను బకాయి ఉన్నట్లు ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పురావస్తు శాఖకు పంపించిన నోటీసుల్లో పొందుపరిచారు. సకాలంలో పన్ను మొత్తాన్ని చెల్లించకపోవడం వల్ల వడ్డీ రూపంలో మరో 47,983 రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన 11,098 రూపాయలను కూడా ఇందులో కలిపారు.
15 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఆగ్రా మున్సిపల్ అధికారులు ఆదేశించిన నేపథ్యంలో పురావస్తు శాఖ తల పట్టుకుంది. దీనిపై ఉన్నతాధికారులను సంప్రదిస్తోన్నట్లు పురావస్తు శాఖ ఆగ్రా జిల్లా సూపరింటెండెంట్ రాజ్ కుమార్ పటేల్ తెలిపారు. ఈ తరహా నోటీసులను తాము ఇదివరకెప్పుడూ అందుకోలేదని, అందువల్ల ఎలాంటి సమాధానాన్ని మున్సిపల్ అధికారులు ఇవ్వాలనేది తెలియట్లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, ఈ నోటీసులపై ఆగ్రా పర్యాటక సంక్షేమ ఛాంబర్ కార్యదర్శి విశాల్ శర్మ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాజ్ మహల్ కేంద్ర ప్రభుత్వ ఆస్తి అని గుర్తు చేశారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తెచ్చుకున్నందున కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఇది కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్.. పురావస్తు శాఖకు పన్ను రికవరీ నోటీసులను ఎందుకు అందజేసిందో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. దీనిపై కేంద్రమే స్పందించాల్సి ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications