ఆసియా కప్ 2022: హస్రంగ చెలరేగిపోవడంతో ఓడిపోయిన పాకిస్తాన్, ఆరోసారి చాంపియన్షిప్ గెలిచిన శ్రీలంక
ఆసియా కప్ టోర్నమెంట్లో శ్రీలంక ఆరోసారి చాంపియన్గా నిలిచింది. దుబాయ్లో జరిగిన ఆసియా కప్ 2022 ఫైనల్లో 23 పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. శ్రీలంక ఆటగాడు వనిందు హస్రంగ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో హీరోగా నిలిచాడు. 2014 తరువాత మళ్లీ ఇప్పుడే శ్రీలంక ఆసియా కప్ గెలుచుకోవడం.
ఈ టోర్నమెంట్లో శ్రీలంక తొలి మాచ్లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయింది. కానీ, ఆ తరువాత ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఈ విజయం ఆ దేశ ప్రజలకు గొప్ప సంతోషాన్నిస్తుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో క్వాలిఫైయింగ్ రౌండ్లో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు ఈ విజయం ఉత్సాసాన్ని అందిస్తుంది.
కుప్పకూలిన పాకిస్తాన్ బ్యాటింగ్
మొదటి నుంచీ పాకిస్తాన్ బ్యాటింగ్కు రిజ్వాన్ వెన్నెముకగా నిలిచాడు. ఈ మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ సాధించి తమ టీంను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ, హస్రంగ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి పాక్ ఆశలపై నీళ్లుజల్లాడు. మొదట రిజ్వాన్ను అవుట్ చేశాడు. హస్రంగ వేసిన బంతిని గుణతిలక క్యాచ్ పట్టడంతో రిజ్వాన్ వెనుదిరిగాడు. అదే ఓవర్లో మూడో బంతికి అసిఫ్ అలీ బౌల్డ్ కాగా, అయిదవ బంతికి ఖుష్దిల్ షా క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో, పాకిస్తాన్ ఏడు వికెట్లకు 112 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రిజ్వాన్ స్లో బ్యాటింగ్ కూడా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచింది. గత మ్యాచ్ల్లో రిజ్వాన్ జట్టుకు ట్రబుల్షూటర్గా నిలిచాడు. కానీ శ్రీలంక బౌలర్లు అతడిని బాగా కట్టడి చేశారు. రిజ్వాన్ స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. పాకిస్తాన్కు అవసరమైన పరుగుల వేగం పెరుగుతూ వచ్చింది. త్వరగా స్కోరు పెంచే ప్రయత్నంలో తొలుత నవాజ్, ఆ తరువాత రిజ్వాన్ కూడా అవుటయ్యారు. రిజ్వాన్ 12.24 స్ట్రైక్ రేట్తో 55 పరుగులు చేశాడు.
శ్రీలంక బౌలింగ్ జోరు ప్రమోద్ మధుషాన్ వేసిన ఓవర్తో నెమ్మదించింది. ఆ ఓవర్లో పాకిస్తాన్కు కొన్ని పరుగులు రావడంతో లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. మధుషాన్ మొదట నో బాల్ వేశాడు. ఫ్రీ హిట్లో షార్ట్ బాల్ బాగా పైకి వెళ్లడంతో వైడ్ అయింది. తదుపరి వైడ్లో ఒక ఫోర్ ఇవ్వడంతో పాకిస్తాన్కు అయిదు పరుగులు వచ్చాయి. అప్పటికే మొత్తం తొమ్మిది పరుగులు వచ్చేశాయి. కానీ, మధుషాన్ అదే ఓవర్లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, ఫకర్ జమాన్ల వికెట్లను వరుసగా పడగొట్టడంతో పాకిస్తాన్ మళ్లీ వెనక్కు తగ్గింది. నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన మధుషాన్ శ్రీలంకకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
పాకిస్తాన్ 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరువాత ఇఫ్తికార్, రిజ్వాన్లు ఇన్నింగ్స్ను 93 పరుగులకు తీసుకెళ్లారు. అయితే రన్ రేట్ వెనుకబడడంతో, వేగంగా స్కోర్ చేయాలనే ఒత్తిడి వారిపై మొదలైంది. గెలవాలంటే చివరి ఐదు ఓవర్లలో 70 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, శ్రీలంక బౌలర్లు వేగంగా వికెట్లు తీస్తూ మ్యాచ్ను తమవైపుకు తిప్పుకున్నారు.
- హార్దిక్ పాండ్యా స్టయిలే వేరు... జీవితాన్ని రాజాలా జీవించాలంటాడు
- ధోని ఎత్తుకున్న పిల్లాడు ఎవరు? గంగూలీకి ముషారఫ్ ఎందుకు ఫోన్ చేశారు
శ్రీలంకను గట్టెక్కించిన రాజపక్ష, హస్రంగ బ్యాటింగ్
శ్రీలంక ఇన్నింగ్స్ ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. ఈ జట్టు 58 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత భానుక రాజపక్ష, వనిందు హస్రంగల బలమైన బ్యాటింగ్ శ్రీలంకను గట్టెక్కించింది. ఇద్దరూ కలిసి స్కోరును 170 పరుగులకు చేర్చారు. రాజపక్ష అజేయంగా 71 పరుగులు చేశాడు. 157.77 స్ట్రైక్ రేట్తో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు.
మరోవైపు, హస్రంగ పాకిస్తాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. 171.42 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి కేవలం 21 బంతుల్లో 36 పరుగులు చేసాడు. ఇందులో అయిదు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు.
ఆరంభ విజయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన పాకిస్తాన్
పాకిస్తాన్ బౌలింగ్ ప్రదర్శన రెండు భాగాలుగా సాగింది. పాక్ బౌలర్లు తొలి 10 ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకను కష్టాల్లో పడేశారు. కానీ, చివరి 10 ఓవర్లలో పాక్ బౌలింగ్ పట్టుతప్పడంతో శ్రీలంక మళ్లీ నిలదొక్కుకుంది.
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ తొలి స్పెల్లోనే శ్రీలంకకు రెండు గట్టి దెబ్బలు ఇచ్చాడు. తరువాత, రాజపక్ష, హస్రంగ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, రవూఫ్కు మళ్లీ బంతిని ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ రవూఫ్, హస్రంగ వికెట్ తీసి వారి భాగస్వాన్ని విచ్ఛిన్నం చేశాడు. అయితే, అప్పటికే హస్రంగ చేయవలసినదంతా చేసేశాడు. మెరుగు వేగంతో ఇన్నింగ్ ఆడి శ్రీలంకను విజయం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
హస్రంగ తరువాత బ్యాంటింగ్కు వచ్చిన కరుణరత్నే సహకరించడంతో, రాజపక్ష నాట్ అవుట్గా నిలిచి శ్రీలంకకు కప్ అందించాడు. ఈ జోడీ ఏడో వికెట్కు 54 పరుగులు జోడించింది.
- ఆసియా కప్: ఒక్క మ్యాచ్ గెలవకపోయినా భారత్కు ఫైనల్ చేరే అవకాశం ఇంకా ఉందా?
- ఆసియా కప్ 2022: భారత్పై పాకిస్తాన్ ఎలా గెలిచింది... ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా చివరి రెండు ఓవర్లలో ఏం చేశారు?
పాక్ ఫాస్ట్ బౌలింగ్ కూడా శ్రీలంకను ఆపలేకపోయింది
స్పీడ్ బౌలర్లకు పాకిస్తాన్లో కొదవ లేదు. ఇమ్రాన్ ఖాన్, వకార్ యూనిస్, వసీం అమ్రామ్.. ఇప్పటికీ ఈ ట్రెండ్ అలాగే ఉంది.
ఫైనల్లో ఆడిన పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు నసీమ్ షా, హరీస్ రవూఫ్, హస్నైన్ గంటకు 150 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో బంతులు విసిరారు. ఈ పేస్ శ్రీలంక బ్యాటింగ్ను కుదిపేసింది. కానీ దాన్ని పాక్ జట్టు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయింది.
నసీమ్ షా శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ను బౌల్డ్ చేశాడు. హరీస్ రవూఫ్ తన ఫాస్ట్ బౌలింగ్తో మరొక ఓపెనర్ నిశాంక, తరువాత వచ్చిన దనుష్క గుణతిలక వికెట్లు తీశాడు. దాంతో, శ్రీలంక కష్టాల్లో పడింది. రవూఫ్ వేసిన ఈ రెండు బంతులు గంటకు 150 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో వెళ్లాయి. కానీ చివరి ఓవర్లలో శ్రీలంక బ్యాట్స్మెన్ విజృంభించారు. పాక్ బౌలర్లు వారిని కట్టడి చేయలేకపోయారు.
ఇవి కూడా చదవండి:
- సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదం: ఇండియాలో ఇక కారు వెనుక సీట్లో కూర్చున్న వారికి కూడా సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తారా?
- తమిళులను చూసి తెలుగు ప్రజలు ఎందుకు దాక్కుంటున్నారు?
- కండోమ్ వాడకంపై ఏపీ, తెలంగాణ పురుషులు ఏమంటున్నారు?
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- ఆంధ్రప్రదేశ్-గుర్రగరువు: నెలల పసికందులు నిద్రలోనే ఊపిరి వదిలేస్తున్నారు... ఏమిటీ డెత్ మిస్టరీ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)