Assam Exit Poll : అసోంలో మళ్లీ బీజేపీదే అధికారం... ఇండియా టుడే ఎగ్జిట్ పోల్లో వెల్లడి...
అసోంలో మరోసారి బీజేపీనే అధికారంలోకి రానుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అసోంలో 75-85 స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగరేస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్ నేత్రుత్వంలోని కూటమి కేవలం 40-50 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఒకప్పుడు అసోంలో చక్రం తిప్పిన అసోం గణపరిషత్ సహా ఇతర పార్టీలు 1-4 స్థానాలు దక్కించుకుంటాయని పేర్కొంది.
తాజా అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అసోం గణ పరిషత్(ఏజీపీ),యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్)తో కలిసి బీజేపీ బరిలో దిగింది. 26 సీట్లు ఏజీపీకి,8 సీట్లు యూపీపీఎల్ పార్టీకి
కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అసోం అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం నిర్వహించారు.

2016లో జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో 84 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 60 స్థానాల్లో గెలిచింది. బీజేపీ మిత్రపక్షాలైన ఏజీపీ 14 స్థానాల్లో,బీపీఎఫ్ 12 స్థానాల్లో గెలుపొందాయి.
తాజా ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 85 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉండటంతో గతం కంటే ఆ పార్టీకి మరో 15 సీట్లు పెరగనున్నాయి.
కాంగ్రెస్ విషయానికి వస్తే బద్రుద్దీన్ అజ్మల్ నేత్రుత్వంలోని ఏఐయూడీఎఫ్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ జతకట్టింది. 2016 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 26 స్థానాల్లో ఏఐయూడీఎఫ్ 13 స్థానాల్లో మాత్రమే గెలుపొందాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారానికి బ్రేక్ వేస్తామని కాంగ్రెస్ ధీమాగా చెప్పినప్పటికీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. నిజానికి సీఏఏ అంశం అసోంలో బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని భావించినప్పటికీ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మాత్రం దాని ప్రభావం లేనట్లుగానే కనిపిస్తోంది.
కాగా, మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 తేదీల్లో మొత్తం మూడు దశల్లో అసోం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మే 2న వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications