హత్య కేసును స్వాగతించిన సీఎం -మిజోరం పోలీసులు కాదు, న్యూట్రల్ ఏజెన్సీ విచారణైతేనే: హిమంత శర్మ
ఈశాన్య భారతంలో అస్సాం, మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంపై మాటల యుద్ధం అంతకంతకూ తీవ్రతరం అవుతున్నది. సరిహద్దులో ఈనెల 26న హింసాత్మక ఘటనల్లో ఆరుగురు అస్సాం పోలీసులు, ఒక పరుడు మరణించడం, 50 మంది తీవ్రంగా గాయపడిన ఉదంతంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సహా ఉన్నతాధికారులపై హత్యయత్నం, దాడి ఆరోపణలతో మిజోరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ఈ చర్యన స్వాగతిస్తూనే మిజోపై సెటైర్లు వేశారు అస్సాం సీఎం...
షాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనం
అస్సాం-మిజోరం సరిహద్దుల్లో హింసాత్మక ఘర్షణలపై ఎలాంటి విచారణకైనా తాను సంతోషంగా సహకరిస్తానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ అన్నారు. అయితే, తాను మిజోరాం సీఎంను ఒక ప్రశ్న వేయదలచుకున్నానని.. ఈ కేసును తటస్థ ఏజెన్సీకి ఆయన ఎందుకు అప్పగించలేదో చెప్పాలని మిజోరాం సీఎం జోరాంతంగాను నిలదీశారు.
అదీగాక, గొడవల్లో పోలీసులు మరణించిన ప్రాంతం రాజ్యాంగబద్ధమైన అసోం భూభాగంలో జరిగందని, అలాంటప్పుడు మిజోరం పోలీసులు కేసు నమోదు చేయడమేంటని, ఇప్పటికే ఈ విషయాన్ని మిజో సీఎంకు చెప్పానని హిమంత పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ట్వీట్ చేశారు..
అస్సాంలోని కచార్ జిల్లా, మిజోరాంలోని కోలాసిబ్ జిల్లాల సరిహద్దు వెంబడి ఈనెల 26న(సోమవారం) జరిగిన ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు మరణించగా, సదరు ఘటనపై మిజోరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై హత్యాయత్నం, కుట్ర పూరిత నేరం, ఆయుధాలతో దాడి తదితర ఆరోపణలు మోపారు. అస్సాం సీఎంతోపాటు ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులు, గుర్తుతెలియని మరో 200 మందిపైనా ఇవే సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Recommended Video
ప్రస్తుతం అస్సాం-మిజోరం సరిహద్దు వెంబడి ఆరు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. జాతీయ రహదారి 306 వెంబడి కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి. రాష్ట్రాలు కొట్టుకు చస్తోంటే, కేంద్రంలోని మోదీ సర్కార్ వేడుక చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 'అటు ఎల్ఏసీ దగ్గరే కాదు, ఇటు రాష్ట్రాల సరిహద్దులూ సురక్షితంగా లేవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.