నదిలో పడిన బస్సు: 5గురు మృతి (వీడియో)
కులు: వేగంగా వెళుతున్నప్రయివేటు బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రయాణికులు గల్లంతు కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు.
డిప్యూటి పోలీసు కమిషనర్ సంజయ్ శర్మ తెలిపిన కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కులు జిల్లాలోని పార్వతి నది ఒడ్డున ఒక ప్రయివేటు బస్సు వేగంగా వెళుతున్నది. ఆ సందర్బంలో బస్సు అదుపు తప్పి పార్వతి నదిలో పడి కొట్టుకుపోయింది.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురి మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 12 మందిని ఆసుపత్రులకు తరలించారు.
ప్రయివేటు బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నారని సంజయ్ శర్మ అన్నారు. 29 మంది ప్రయాణికులు గల్లంతు అయ్యారని, కనీసం బస్సు కనపడటం లేదని శర్మ చెప్పారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు, గాయాలైన బాధితులు చెప్పారని సంజయ్ శర్మ తెలిపారు.