11 నెలలుగా ఫ్రీజర్లో స్వామి శవం: అంత్యక్రియలకు నో
జలంధర్: పంజాబ్లోని జలంధర్ ఆశ్రమంలో అశుతోష్ మహారాజ్ మరణించి 11 నెలలవుతోంది. శవాన్ని ఫ్రీజర్లో పెట్టారు. అతను మళ్లీ బతికి లేచి వస్తాడని భక్తులు నమ్ముతున్నారు. దాంతో అంత్యక్రియలకు ఆయనగారి భక్తులు అంగీకరించడం లేదు. దీంతో న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ నెల 15వ తేదీలోగా అంత్యక్రియలు చేయాలని కోర్టు ఆదేశించింది.
అయితే, అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చే పోలీసులతో సమరానికి ఆయన భక్తులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది జనవరి 29వ తేదీన అశుతోష్ మహరాజ్ మరణించారు. వైద్యపరంగా ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు. అయితే, భక్తులు ఆయన శవాన్ని ఫ్రీజర్లో భద్రపరిచారు. దీనిపై కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అంత్యక్రియలను నిరోధించడానికి భక్తులు ఆశ్రమం వద్ద కాపలా కాస్తున్నారు. గత 48 గంటలుగా అశుతోష్ మహరాజ్ భౌతిక కాయాన్ని భద్రపరిచిన దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. న్యాయస్థానం తీర్పుపై అసంతృప్తిగా ఉన్న కొంత మంది భక్తులు పైకోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మహరాజ్ మరణించలేదని, సమాధిలోకి వెళ్లారని భక్తులు వాదిస్తున్నారు. ప్రజలు పెద్ద యెత్తున అక్కడ గుమికూడకుండా చూడడానికి పోలీసులు డేరా యజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. తమ గురువు సమాధిలోకి వెళ్లిన విషయాన్ని హైకోర్టు వినిపించుకోలేదని, తాము పైకోర్టుకు వెళ్తామని అంటున్నారు. తాజా పరిణామాలతో ఆశ్రమానికి పెద్ద యెత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ప్రిత రోజూ దాదాపు 3 వేల మంది వచ్చి వెళ్తున్నారు. ఆశ్రమంలోపల ఏడు లేదా ఎనిమిది లైసెన్స్ ఉన్న ఆయుధాలు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.
హర్యానాలోని రాంపాల్ ఆశ్రమం ఉదంతం జలంధర్లో పునరావృతమవుతుందేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. అశుతోష్ మహరాజ్ దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్కు వందల కోట్ల ఆస్తులున్నట్లు సమాచారం. ఆయన కుమారుడిగా చెబుకుంటున్న ఓ వ్యక్తి అంత్యక్రియల నిర్వహణకు భౌతిక కాయాన్ని తనకు అప్పగించాలని కోరుతున్నాడు.