ఎటిఎం దాడి: అనంతలోను హత్య, నిందితుడు ఒక్కడే?
బెంగళూరు/అనంతపురం: ఆరు రోజుల క్రితం కర్నాటక రాజధాని బెంగళూరు ఎటిఎం దాడి నిందితుడు మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోను ఓ ఘాతుకానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ నెల 19న బెంగళూరులో ఎటిఎంలో డబ్బులు డ్రా చేస్తున్న బ్యాంక్ మేనేజర్పై తుపాకీ, కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కిరాతకుడు కరడుగట్టిన నేరగాడు... లేదా సైకో అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
బెంగళూరు దాడికి ముందే అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణం చంద్రబాబునగర్కు చెందిన ప్రమీలమ్మ (60)ను ఈ నెల 10వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసి కమ్మలు, ఎటిఎం కార్డు, విలువైన డాక్యుమెంట్లు అపహరించాడు. అయితే, 11-12 తేదీల్లో ఆమె ఎటిఎం కార్డుతో ఎవరో డబ్బు డ్రా చేసినట్టు గుర్తించిన ప్రమీలమ్మ కుమారుడు పోలీసులకు సమాచారం అందించారు.

దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు కదిరిలోని స్టేట్బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్దగల ఎటిఎం సెంటర్లో నిందితుడు డబ్బులు డ్రా చేసినట్టు తెలుసుకుని, అందులోని సిసి కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. బెంగళూరు దాడి నిందితుడు, కదిరిలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి ఒకే చొక్కా, ఖాకీ ప్యాంటు ధరించి ఉండటం, కత్తిని దాచుకున్న బ్యాగ్ కూడా ఒకేలా ఉండటంతో ఇద్దరూ ఒకరేననే అంచనాకు వచ్చారు. ఆ ఎటిఎం కార్డును బ్లాక్ చేయించారు.
ఈ కారణంగా అతడు డబ్బు కోసం బెంగళూరు ఎటిఎంలో జ్యోతిపై దాడిచేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక పోలీసులు ఆదివారం కదిరికి చేరుకుని వివరాలు సేకరించారు. అతడి బ్యాగులో డమ్మీ తుపాకి, కత్తి ఉండటంతో అతడేమైనా సైకోనా? ఒంటరి మహిళలపై దాడి చేసి డబ్బు, నగలు దోచుకునే దోపిడీదారుడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కిరాతకుడి చేతిలో తీవ్ర దాడికి గురైన బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్ కోలుకుంటున్నారు. బెంగళూరులో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి భద్రత లేని ఎటిఎంలను పోలీసులు మూసివేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications