ఏటీఎం నుంచి డబ్బుల వర్షం: రూ.3,500 డ్రా చేస్తే రూ.70వేలు
నోట్ల రద్దు, నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులకు రాజస్థాన్లోని ఓ ఏటీఎం డబ్పుల వర్షం కురిపించింది. ఇది స్థానికంగా కలకలం రేపింది.
జైపూర్: నోట్ల రద్దు, నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులకు రాజస్థాన్లోని ఓ ఏటీఎం డబ్పుల వర్షం కురిపించింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. జైపూర్కు సమీపంలోని టాంక్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకున్న వ్యక్తులకు లాభం తెచ్చి పెట్టింది. అడిగిన దాని కంటే ఎక్కువగా భారీ మొత్తంలో నగదును అందించింది. దీంతో ఏటీఎం కేంద్రానికి పెద్ద ఎత్తున జనాలు పరుగు పెట్టారు.
ఈ ప్రాంతానికి చెందిన జితేష్ దివాకర్ ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి సమీపంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంకు మంగళవారం సాయంత్రం వెళ్లాడు. తన అవసరాల దృష్ట్యా 3,500 రూపాయలు డ్రా చేయడానికి ఏటీఎం మెషిన్లో టైప్ చేశాడు.
అయితే ఆ ఏటీఎం నుంచి అనూహ్యంగా డబ్బు బయటికొచ్చింది. వస్తూనే ఉంది. అది 3500 రూపాయలను దాటి 70వేల వరకూ నోట్ల వర్షం కురిపించింది. ఊహించని ఘటనతో దివాకర్ అవాక్కయ్యాడు.
ఏటీఎంలో నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగా ఇలా నోట్లు వస్తూనే ఉన్నాయని అధికారులు తేల్చారు. అయితే దివాకర్ కంటే ముందు డబ్బు డ్రా చేసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారట. కోరిన సొమ్ము కన్నా ఎక్కువ వస్తుండటంతో గుట్టు చప్పుడు కాకుండా డబ్బు తీసుకుని వెళ్లిపోయారు. వీలైనన్ని ఏటీఎం కార్డులు తెచ్చుకుని అదనపు సొమ్మును పొందారు.
కానీ, దివాకర్ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దివాకర్ తన తండ్రి, బాబాయ్తో కలిసి బ్యాంకు మేనేజర్కు జరిగిన ఘటన గురించి వివరించాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఏటీఎంలో దాదాపు రూ.6.76లక్షలు నింపినట్లు బ్యాంకు మేనేజర్ తెలిపాడు.
100 నోట్లు స్థానంలో 2 వేల నోట్లు రావడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సాంకేతిక నిపుణులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు మేనేజర్ చెప్పారు. అయితే దివాకర్ కంటే ముందు డబ్బు డ్రా చేసిన వారి ఖాతా వివరాలను పరిశీలిస్తున్నామని, ఆ రెండు గంటల్లో డబ్బు డ్రా చేసిన వారి గురించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.