ఐఎస్ సూసైడ్ బాంబర్ అయ్యేందుకు సిద్ధపడిన పుణె యువతి
ముంబై/న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరేందుకు మహారాష్ట్రలోని పుణెకి చెందిన ఓ 16ఏళ్ల అమ్మాయి ప్రయత్నం చేసింది. అందు కోసం సిరియాలోని ఓ మెడికల్ కళాశాలలో సీటు కోసం దరఖాస్తు చేసుకుని సిరియాకి ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యింది. విషయం తెలుసుకున్న పుణె యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.
ఆమెను విచారించిన అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువతి పుణెలోని సిటీ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా ఇస్లామిక్ స్టేట్ సభ్యులతో స్నేహం ఏర్పడింది. వారు ఆమెకు ఉగ్రవాద భావాల్ని నూరిపోయడంతో ఆమె ఐఎస్లో చేరేందుకు సన్నద్ధమైంది.
అంతేగాక, ఆ యువతి ఐఎస్లో చేరి ఆత్మాహుతి బాంబర్ కావాలని కోరుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఐఎస్ ఉగ్రవాదం పట్ల తీవ్రంగా ప్రభావితమైనట్లు చెప్పారు. ఐఎస్ ఉగ్రవాదులు ఆమెను ఉగ్రవాదం పట్ల ఆకర్షింపజేసినట్లు తెలిపారు.
ఈ విషయమై ఏటిఎస్ పుణె అధికారి భాను ప్రతాప్ బర్గే మాట్లాడుతూ.. 10, 12 రోజుల క్రితం ఏటీఎస్ పోలీసుల నుంచి తమకు ఈ అమ్మాయి విషయమై సమాచారం అందిందన్నారు. టీవీలో ఓ డాక్యుమెంటరీని చూసిన అనంతరం ఆమె ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితురాలయ్యిందని చెప్పారు.
అనంతరం ఫేస్బుక్ ద్వారా వివిధ దేశాలకు చెందిన 200 మంది ఐఎస్ సానుభూతిపరులతో స్నేహం కొనసాగిస్తోందని తెలిపారు. గత మూడు నాలుగు నెలల్లో ఇస్లామిక్ స్టేట్కి చెందిన రెండు, మూడు పనుల్లో ఆమె జోక్యం ఉందని వెల్లడించారు.
ఆమె తన జీవితంలో కొన్ని మార్పులు కూడా చేసుకుందని వివరించారు. కొంత కాలం నుంచి బురఖా కూడా ధరిస్తోందని తెలిపారు. ఆమె కుటుంబసభ్యులు కూడా ఈ మార్పులను గుర్తించారని చెప్పారు. అయితే వారు తమ కూతురు ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరుతుందని ఊహించలేదని చెప్పారు. ఐఎస్ ఆదేశం మేరకు ఆ యువతి సిరియా వెళ్లేందుకు సన్నద్ధమైందని పేర్కొన్నారు.