ఆస్ట్రేలియాలో సిక్కులపై దాడి.. దాడి చేసింది భారతీయులేనా..? రైతు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నందుకేనా?
ఆస్ట్రేలియాలో సిక్కు మతానికి చెందిన కొందరు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. గత ఆదివారం(ఫిబ్రవరి 28) రాత్రి సిడ్నీ వెస్ట్లోని హ్యారిస్ పార్క్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది. రాడ్లు,బేస్ బాల్ బ్యాట్లతో దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారులో కూర్చొన్నవారికి ఎలాంటి గాయాలవలేదు.జాత్యహంకారమే ఈ దాడికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో భారతీయులే భారతీయ సిక్కులపై దాడికి పాల్పడ్డారన్న వాదన కూడా వినిపిస్తోంది.
దాడి చేసింది భారతీయులేనా...?
స్థానిక అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం... భారత్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంబంధించి ఇక్కడి భారతీయులు రెండుగా చీలిపోయారు. రైతు ఉద్యమానికి మద్దతునిస్తున్నవారికి,వ్యతిరేకిస్తున్నవారికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సిక్కులపై దాడి జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి నుంచి బయటపడ్డ లిటిల్ ఇండియా ఆస్ట్రేలియా అసోసియేషన్ ప్రతినిధి కమల్ సింగ్ మాట్లాడుతూ... 'వాళ్లు మా వెంట ఎందుకుపడ్డారు... మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు.. ఏదైనా సరే మేము శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నాం. ఇలా భౌతిక దాడులకు పాల్పడటం సరికాదు. ఇదెలా ఉందంటే... ఇండియన్తో ఇండియనే ఫైట్ చేస్తున్నట్లు ఉంది.' అని పేర్కొన్నారు.
రోజురోజుకు పెరుగుతున్న గొడవలు..!!
టర్బన్స్ 4 ఆస్ట్రేలియా ప్రతినిధి అమర్ సింగ్ మాట్లాడుతూ... రోజురోజుకు ఈ గొడవలు మరింత పెరిగిపోతున్నాయని చెప్పారు. తమ ఆలయాలను కూడా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తాజా ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీని వెనకాల జాత్యహంకార కోణం ఉందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఘటనలకు ఆస్ట్రేలియాలో తావు లేదని... ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను వదిలిపెట్టమని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో కారు తీవ్రంగా డ్యామేజ్ అయిందని.. సుమారు 10వేల డాలర్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.
కొనసాగుతున్న రైతు ఉద్యమం...
దాదాపు గత మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్,టిక్రీ,సింఘూ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రైతు ఉద్యమంపై ఖలీస్తాన్ తీవ్రవాద ఉద్యమం అన్న ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. కొంతమంది నేతలు బాహాటంగానే రైతులను ఖలీస్తానీ ఉగ్రవాదులు అని ఆరోపించారు. ఎవరెన్ని విమర్శలు,ఆరోపణలు చేసినా రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దే తమ ఏకైక డిమాండుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియాలో సిక్కులపై దాడి చర్చనీయాంశంగా మారింది.