అతుల్య గంగా: పవిత్ర నదిని శుభ్రం చేసేందుకు నడుం బిగించిన మాజీ ఆర్మీ అధికారులు
గంగా నది...పవిత్రమైన నది.తాగు నీరు, పంటపొలాలకు ఆధారంగా నిలిచిన నది. కుటుంబంలో ఒకరు మృతి చెందితే వారి అస్తికలు తనలో కలిపేసుకునే నది. ప్రస్తుతం ఈ నది మానవుడి తప్పిదాలతో తన పవిత్రతతను కోల్పోతోంది. ఈ పుణ్యనదిలో ఎటు చూసినా వ్యర్థాలే కనిపిస్తున్నాయి. మన ప్రాచీన నదిని తిరిగి కాపాడుకునేందుకు భారత ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వృద్ధులు ముందుకొచ్చారు. ఒకప్పుడు దేశాన్ని కాపాడుకునేందుకు సైనికులుగా ముందువరసలో నిలిచిన వీరు.. ఇప్పుడు పవిత్రమైన గంగానదిని పరిరక్షించుకునేందుకు నడుం బిగించారు.
అయితే పూర్వ వైభవంను తీసుకురావడం చాలా కష్టమైన పనే అయినప్పటికీ... వీరు మాత్రం వెనకడుగు వేయడం లేదు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 50 కోట్ల మంది ప్రజలకు తాగు సాగు నీరు అందిస్తున్న ఏకైక నది గంగా నది. గంగా నది పరిసరాల్లో ప్రతి 12 మందిలో ఒకరు ఇక్కడే నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 15న అతుల్య గంగా పేరుతో ఈ నదిని శుభ్రపరిచేందుకు భారత మాజీ సైనికులు కదం తొక్కనున్నారు. ఓ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.
లెఫ్ట్నెంట్ కల్నల్ హెమ్ లోహుమీ, గోపాల్ శర్మ, కల్నల్ మనోజ్ కేశ్వర్లు కలిసి అతుల్య గంగా కార్యక్రమానికి పునాది వేశారు. పరిక్రమ, కాలుష్యం, ప్రజలు అనే ఈ మూడు బలమైన స్తంభాలపై ఏర్పాటు చేశారు. దృఢ సంకల్పంతో పనిచేస్తే అసాధ్యమైనదంటూ ఏమీ లేదని చెబుతున్న వీరు... గంగా నదిని కూడా అదే సంకల్పంతో శుభ్రం చేయగలమన్న బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రకృతి, సంస్కృతి, పురాణాలు చరిత్రతో మేళవింపు కలిగినదై ఉంది. దేశానికి వెన్నెముకగా నిలిచిన యువతలో అవగాహన తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామని కల్నల్ మనోజ్ కేశ్వర్ చెప్పారు.గత 1600 ఏళ్లలో ఎవరూ ఈ పవిత్రమైన పుణ్యనదిని కాపాడుకునే ప్రయత్నంలో నిబంధనలు పాటించలేదని చెప్పారు. గంగా నది చరిత్ర వేద కాలం నుంచి ఉందని గుర్తు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఇలా కాలినడకన నడిచే ప్రాంతాలు 20 ఉన్నాయని , అయితే భారత్లో ఇంకా కనుగొనాల్సి ఉందని చెప్పారు కల్నల్ మనోజ్ కేశ్వర్. ఇక తాము 5వేల కిలోమీటర్ల మేరా కాలినడకన నడిచి గంగానదిని శుభ్రపరిచే కార్యక్రమం సాహస ప్రియులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఇక గంగా నదికి కాలుష్యం అనేది శాపంగా మారింది. చుట్టుపక్కల ఉన్న పారిశ్రామికవాడలనుంచి వచ్చే వ్యర్థంతో గంగానది శోభను కోల్పోతోంది. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ మాజీ సైనికులు చెప్పారు. మొత్తం నదీ వ్యవస్థను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భారత ప్రభుత్వం గంగా నదికి తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు అడుగులు ముందుకు వేసిందన్నారు కల్నల్ మనోజ్. ఇక మన జీవనదులపై యువతకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఒక్కసారి కాలుష్య కోరల్లో చిక్కుకున్న నదులపై స్టడీ చేశాక ఇందుకు బాధ్యులు ఎవరో గుర్తించడమే మలి అడుగని కల్నల్ మనోజ్ చెప్పుకొచ్చారు.
అతుల్య గంగా అనే ఈ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా సాగుతుందని డిసెంబర్ 15న ప్రారంభమై 10 ఆగష్టు 2021న ముగుస్తుందని కల్నల్ చెప్పారు. 2020 నుంచి 2030 వరకు మొత్తం 11 ఏళ్ల ప్రాజెక్టు ఇదని చెప్పిన కల్నల్ ఇందులో రెండు పంచవర్ష ప్రణాళికలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా 50వేల గ్రామాలు, 45 నగరాలను 220 రోజుల్లో పర్యటిస్తామని చెప్పారు. పరిస్థితులు అనుకూలించి ఉంటే ఈ కార్యక్రమంలో వీలైనంత ఎక్కువమందిని భాగస్వామ్యం చేయాలని భావించామని అయితే కరోనా కారణంగా కొన్ని ఆంక్షల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో మొత్తం 6 మంది శాశ్వత వాకర్స్ ఉండగా ఇందులో 150 రిలే మరియు 20,000 మినీ వాక్స్ ఉంటాయని చెప్పారు. ఇక ప్రతి 5 కిలోమీటర్లకు గంగా నది శాంపిల్స్ను పరీక్షించడం జరుగుతుందని, అదే సమయంలో భూగర్భ జలాలు అక్కడి మట్టిని పరీక్షించడం జరుగుతుందని చెప్పారు. ఇక వాక్ జరుగుతున్న సమయంలోనే మర్రి చెట్టు, వేప చెట్టు, పీపల్ చెట్లను నాటడం జరుగుతుందని వివరించారు.
Recommended Video
అతుల్య గంగా కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలోనే కొన్ని దాగి ఉన్న సమస్యలను కూడా ప్రస్తావించి వాటిపై అవగాహన తీసుకొస్తామని చెప్పారు కల్నల్ మనోజ్. క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన భోజ్పూర్ కష్టాలపై అవగాహన తీసుకొస్తామని కల్నల్ మనోజ్ చెప్పారు. భోజ్పూర్లో క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్న వారు మొత్తం దేశంకంటే సగటున 10 రెట్లు ఎక్కువగా ఉన్నారని గుర్తు చేశారు. ఇక భారతీయ యువత మేల్కొనాలని పర్యావరన పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. పరిస్థితి చేదాటి పోకముందే యువత కార్యాచరణ ప్రారంభించాలని కోరారు. తాము చేపడుతున్న ప్రాజెక్టు ద్వారా ఇదే పరిస్థితి ఉన్న ఇతర నదులు అంటే యమునా లాంటి నదులను కూడా శుభ్రంచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
భారత్ అంటే గంగా నది అనేలా సంస్కృతి చాటుతోందని కానీ ఈ పవిత్రమైన పుణ్యనది పరిస్థితి నేడు అద్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సైనికులు. కానీ ఈ మాజీ ఆర్మీ అధికారులు నడుం బిగించడంతో నదుల పరిరక్షణ జరుగుతుందనే నమ్మకం ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.